జనసేన కార్యకర్తలు కలవాలి: ఖమ్మంలో నోరు జారిన బాబు!, పవన్ కళ్యాణ్ భయం వల్లేనంటూ..
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నోరు జారారు. ఖమ్మం జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత సుదీర్ఘ ప్రసంగం చేశారు. చివరలో ఆయన కోదండరాంకు చెందిన పార్టీ పేరు చెప్పబోయి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనను పేర్కొన్నారు.
తెలంగాణ జనసేన
కేసీఆర్కు, మజ్లిస్ పార్టీకి ఓటేస్తే పరోక్షంగా నరేంద్ర మోడీకి ఓటు వేసినట్లే అని, కాబట్టి మీరంతా సైనికుడిలా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉందని చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ, అదే మాదిరి జనసేన.. తెలంగాణ జనసేన (కోదండరాం తెలంగాణ జన సమితి అని చెప్పబోయి), సీపీఐ ఇలా అందరు కార్యకర్తలు కలవాలన్నారు. ఇది మీ బాధ్యత అని, ఎవరూ చెప్పవలసిన అవసరం లేదన్నారు. అందరూ ఏకతాటి పైకి వచ్చి గెలిపించుకోవాలన్నారు. అన్ని పార్టీలకు, అందరూ కలిసి పని చేసి గెలిపించుకోవాలని చెప్పారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్
తెలంగాణ జన సమితికి బదులు జనసేన పేరు చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చంద్రబాబు వ్యాఖ్యలపై ట్రోల్స్ బాగా వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లోను చంద్రబాబు జనసేన పేరును తలుచుకుంటున్నారని, నిద్రలోను పవన్ కళ్యాణ్ను గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. ఇది భయంతో ఎక్కువగా జనసేన పేరును తలుచుకోవడం వల్ల వచ్చిన మాటా లేక మా బలాన్ని ఇలా సిగ్గులేకుండా నీచ కూటమివైపు తిప్పుకోవడం కోసం వచ్చిన మాటా అని ట్రోల్స్ వస్తున్నాయి.
తెలంగాణ యువతపై ప్రశంసలు
అంతకుముందు, చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ఏపీ సీఎంగానే ఉంటానని, తెలంగాణ హితం కోసం పని చేస్తానని చెప్పారు. ఓటు వేశాక బ్యాలెట్ పేపర్ పైన ఎవరికి ఓటు వేశామో సరిగా చూసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు వేసే హక్కు ఉందని చెప్పారు. మీ ఉత్సాహం చూస్తుంటే తెలంగాణలో కూటమి గెలుస్తుందని అర్థమవుతోందన్నారు. హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతులాంటిదని చెప్పారు. ప్రోత్సహిస్తే తెలంగాణ యువత ప్రపంచాన్ని శాసించే శక్తిలా తయారవుతుందని చెప్పారు.
కేసీఆర్ పైన నిప్పులు
తెలంగాణలో అభివృద్ధి లేదని, అప్పులు పెరిగాయని కేసీఆర్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. తెలంగాణకు మిగులు బడ్జెట్ సహా అన్ని అవకాశాలు ఉంటే ఉపయోగించుకోలేదన్నారు. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించలేదని, సమన్యాయం చేయమని చెప్పానని అన్నారు. నేనేదో తెలంగాణపై పెత్తనం చేస్తానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ రోజు నేను తెలంగాణకు వచ్చి పోటీచేసే అవకాశం లేదని, నేనే ఏపీకి సీఎంగా ఉంటానని, తెలంగాణలో ప్రజల అభ్యున్నతికి అండగా నిలుస్తానని హామీ ఇస్తున్నానని చెప్పారు. గోదావరి జలాలు ఏవిధంగా ఉపయోగించుకోవాలనేది ఆనాడు ఆలోచించామని, కృష్ణానదిలో నీళ్లు రాలేదని, గోదావరి 2500 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని, దానిని ఉపయోగించుకుంటే తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమవుతాయని చెప్పారు. తెలంగాణ కింద ఉన్న ఏపీ నీళ్లకు అడ్డు పడుతోందని మాట్లాడటం ఎంతవరకు సబబు అన్నారు.