పార్టీ భేటీలో పొగడ్త.. తర్వాత కేసీఆర్కు ఫోన్ చేసి చంద్రబాబు శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు.
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఫోన్ చేశారు. ఈ రోజు కేసీఆర్ పుట్టిన రోజు. ఫోన్ చేసిన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఓటుకు నోటు కేసు అనంతరం కేసీఆర్ - చంద్రబాబుల మధ్య విభేదాలు కనిపించాయి. ఆ తర్వాత, అవి సమసిపోయాయి. ఇప్పుడు ఇరువురు సీఎంలు కూడా.. పక్క రాష్ట్రాలతో బాగుంటామని చెబుతున్నారు. వీరు ఇరువురు కూడా పలుమార్లు కలుసుకున్నారు. ఓటుకు నోటు తర్వాత చంద్రబాబు - కేసీఆర్లు ఎప్పుడు కలుసుకున్న చర్చనీయాంశంగా మారుతోంది.
మరో ఆసక్తికర విషయమేమంటే.. ఈ రోజు విజయవాడలో టిడిపి వర్క్ షాప్ సందర్భంగా చంద్రబాబు.. కేసీఆర్ పేరును ప్రస్తావించారు. కులం, మతం చూసి ప్రజలు ఓటేయరని, మనం చేసే పని ఆధారంగా ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా చెప్పే సందర్భంలో ఆయన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. తెలంగాణలో కేసీఆర్ కులం ప్రాతిపదికగా గెలవలేదని చెప్పారు. తద్వారా ఆయన పని చేశాడని, చేస్తాడని గెలిపించాడని అభిప్రాయపడ్డారు.