అవసరం లేదని చంద్రబాబును తిప్పి పంపారు: తలసాని, కోదండరామ్ అభినందన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అవసరం ఈ రాష్ట్రానికి లేదంటూ ప్రజలు తిప్పి పంపారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. జీహేచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై మంత్రి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఇచ్చిన మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామన్నారు.
ఉప ఎన్నికలకు సిద్ధమని తాను మొదటి నుంచి చెబుతున్నానని ఆయన అన్నారు. సుపరిపాలనను ప్రజలు ఆదరిస్తారనడానికి తమ పార్టీ గెలుపే నిదర్శనమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని మంత్రి తలసాని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే వాళ్ల నియోజకవర్గాలకైనా, 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకురావాలని మంత్రి తలసాని సవాలు చేశారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన అభివృద్ధి ఫలితమే టీఆర్ఎస్ను గెలిపించిందని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గెలిచిన కార్పొరేటర్లు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహేందర్రెడ్డిలను కలిశారు. గెలిచిన కార్పొరేటర్లను మంత్రులు అభినందించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్కు అభినందనలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. టీఆర్ఎస్ విజయంతో హైదరాబాద్ అభివృద్ధి అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. గ్రేటర్ మేయర్ ఎన్నికల చరిత్రలో ఇదివరకు ఎన్నడూలేని రీతిలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది గూలాబి జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే.