నా భార్యపై కెసిఆర్ అబద్దాలు, కేసులకు భయపడొద్దు: చంద్రబాబు
హైదరాబాద్: తన సతీమణి నారా భువనేశ్వరి కూడా టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తుందన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొన్న తన పైన, నిన్న తన భార్య పైన కెసిఆర్ అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఫిబ్రవరి 2వ తేదీన జరగనున్నాయి. ఈ సాయంత్రం ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గ్రేటర్ పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని, దీనిని కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. అది భరించలేకనే అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తన స్థాయిని మరిచి అబద్దాలు ఆడుతున్నారని టిడిపి నేతలతో వ్యాఖ్యానించారు.
కెసిఆర్ అలా మాట్లాడితే ఆయనకే నష్టమని చెప్పారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, దానిని అడ్డుకోవాలని చెప్పారు. ఓటుకు నోటు వంటి కేసుల నేపథ్యంలో వాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మనం గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
రెండు రోజుల క్రితం.. తనకు హైదరాబాదులో ఏం పని అని కెసిఆర్ ప్రశ్నించారని, ఇప్పుడేమే తన భార్య భువనేశ్వరి తెరాసకు ఓటు వేస్తానని చెప్పారని కెసిఆర్ చెప్పారని, అన్నీ అబద్దాలు ఆడుతున్నారన్నారు. ఈ రెండు రోజుల పాటు అఫ్రమత్తంగా పని చేస్తే గ్రేటర్ పీఠం మనదే అన్నారు.
పోలింగ్ రోజు మాత్రం మరింత అప్రమత్తంగా ఉండాలని, తెరాస నేతలు అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలన్నారు. టిడిపి, బిజెపి నేతలు మరింత సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ .. చంద్రబాబును లక్ష్యంగా పెట్టుకొని వ్యాఖ్యానించిన వియం తెలిసిందే.