ఆన్లైన్ మోసం: బంగారం గెలిచారని, రూ.20 దండను పంపించాడు
హైదరాబాద్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్టు చేశారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీరభద్ర రావు బంజారాహిల్స్లో ఓ కంపెనీ పేరుతో ఆన్లైన్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
అందులో నష్టాలు వచ్చాయి. దీంతో అతను లాటరీ మోసాలు చేయడం ఆరంభించాడు. మూడు గ్రాముల బంగారం, రూ.6వేల నగదు లాటరీ ద్వారా గెలిచారంటూ ప్రజల మొబైళ్లకు సందేశాలు పంపించేవాడు. రూ.642లు చెల్లిస్తే వీటిని అందజేస్తామని నమ్మించేవాడు.
వాటిని కొందరు నమ్మి.. ఆ మొత్తాన్ని చెల్లిస్తే కేవలం రూ.20 విలువగల పూసలదండను పంపుతున్నాడు. ఈ విధంగా దేశవ్యాప్తంగా చాలామందిని మోసం చేసి సుమారు రూ.4కోట్ల మోసం చేశాడు. నిందితుడి నుంచి పోలీసులు బ్యాంకు చెక్కులు, ల్యాప్టాప్, రూ.14వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.
మరో వ్యక్తి అరెస్టు
ఆన్లైన్ మోసాలకు పాల్పడుతోన్న వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లిప్కార్డ్, ఆమెజాన్ సంస్థలను నిందితుడు మోసగించాడనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు సంస్థలకు మొత్తం రూ.36 లక్షలు మోసం చేశాడు.