కిలాడీ మహిళ కోసం వేట: చిన్నారిని కిడ్నాప్ చేసి వదిలేసింది (ఫొటోలు)
హైదరాబాద్: చాక్లెట్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి పాఠ శాలకు వెళ్లి వస్తున్న ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన ఓ మహిళ ఉదంతం హైదరాబాదులోని నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ చిన్నారి చెవులకు ఉన్న బంగారు దుద్దులు తీసుకొని అంబర్పేటలో వదిలిపెట్టింది. దీంతో కిడ్నాప్ మిస్టరీ వీడింది.
ఇన్స్పెక్టర్ వి.యాదగిరిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...అడిక్మెట్ వీధినెంబర్ ఆరులో గల హైమన్ డార్ప్ నిలయంలో ప్రభుత్వ బాలికల వసతి గృహం ఉంది. అందులో వసం దివ్య ఆయాగా పని చేస్తోంది. ఈమెకు భర్త లేడు. ఇద్దరు సంతానం. కుమారుడు వి.భాను రెండవ తరగతి చదువుతున్నాడు. కూతురు వి.హర్షిత(5) స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.
స్వాతంత్ర దినోత్స వా న్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 8.30కు భాను, హర్షిత ఇద్దరు పాఠశాలకు వెళ్లారు. పదిన్నర సమయంలో భాను ఒక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లెలు హర్షిత రాలేదని తల్లి దివ్య భానును ప్రశ్నించగా ఒక గుర్తు తెలియని మహిళ చాక్లెట్ ఇస్తానని చెల్లెలిని తీసుకెళ్లిందని తల్లికి చెప్పాడు. దీంతో కంగారుగా అంతటా గాలించింది. అయినా ఫలితం కనిపించలేదు.
వెంటనే నల్లకుంట పోలీస్స్టేషన్కు వెళ్లి జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేపట్టాడు. అయితే ఆ గుర్తు తెలియని మహిళ చిన్నారి చెవులకు ఉన్న రెండు గ్రాముల బంగారు దుద్దులను తీసుకొని అంబర్పేట మహంకాళి ఆలయం వద్ద వదిలిపెట్టి వెళ్లింది. అక్కడ ఏడుస్తూ ఉంటే ఓ వ్యక్తి ఆ బాలికను తీసుకెళ్లి అంబర్పేట పోలీసులకు అప్పగించాడు.
అప్పటికే బాలిక కిడ్నాప్ అయిన విషయాన్ని అన్ని పోలీస్స్టేషన్లకు నల్లకుంట పోలీసులు చేరవేయడం, అంబర్పేటలో లభ్యం కావడంతో పోలీ సులు అక్కడకు వెళ్లి బాలికను గుర్తుపట్టి తీసుకు వచ్చారు. తల్లికి ఆ బాలికను అప్పగించారు. అయితే కిడ్నాప్ చేసిన మహిళ ఎవరనే విషయాన్ని పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కడైనా సీసీ కెమెరాల్లో ఈ సంఘటన నమోదై ఉందేమోనని పరిశీలిస్తున్నారు.