పరస్పర అవగాహన: కేసీఆర్ భేటీ అయిన చైనా ఇన్ ఫ్రా కంపెనీలు
హైదరాబాద్: చైనా ఇన్ ఫ్రా కంపెనీల ప్రతినిధులు సీఎం కేసీఆర్తో క్యాంఫ్ ఆఫీసులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నగరాల్లో ప్రపంచ స్ధాయి మౌలిక వసతులు కల్పించే బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని సీఎం కేసీఆర్ వారిని కోరారు.
తెలంగాణలో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన నగరాల్లో రహదారులు, బ్రిడ్జిలు, సస్పెన్షన్ బ్రిడ్జిల నిర్మాణంలో పాలు పంచుకుంటామని ఇన్ఫ్రా కంపెనీల ప్రతినిధులు సీఎంకు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో కొత్తగా చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రణాళికను సీఎం చైనా కంపెనీల ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, మంచిర్యాల కార్పోరేషన్లలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన చొట కొత్త వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. ఇప్పటికే చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమంతో పాటు మూసీ నదిపై తూర్పు నుంచి పడమర వరకు 42 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారిని నిర్మించే ప్రణాళికను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.
వరంగల్, నల్గొండ, కరీంనగర్ తదితర హైవేలకు ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు దుర్గం చెరువుపై కూడా ఓ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు, అందుకు అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చైనా ఇన్ ఫ్రా ప్రతినిధులకు సీఎం వివరించారు.