రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి: ఏమన్నారంటే?
గద్దర్ అవార్డుల విషయంలో తన ప్రకటనపై సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంత అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తోపాటు పలువురు తాజాగా స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి తన సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్పందిస్తూ ట్వీట్ చేశారు. దీంతోపాటు గతంలో గద్దర్ అవార్డులకు తను మద్దతుగా మాట్లాడిన వీడియోని చిరంజీవి పంచుకున్నారు.

'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ రు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.
మరోవైపు, ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పందించారు. తాము సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని.. రెండు మూడు సార్లు కాల్ చేశామని చెప్పారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. సీఎం రేవంత్ అపాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి మాట్లాడటానికి రెడీగా ఉన్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H
సీఎం రేవంత్ ఏమన్నారంటే..?
గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు తెలుగు పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ... నంది అవార్డులలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటోందని, కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి దీని పట్ల స్పందన రాలేదని వ్యాఖ్యానించారు.
'నా అంతట నేను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు' అని ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉంటోందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

'నేను వారికి (టాలీవుడ్ పెద్దలు) గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పాను. సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్నవారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని ఈ వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేశాను. కానీ, ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి... మీ విజ్ఞప్తి కంటే ముందే నేను ఓ ప్రకటన చేశాను. నంది అవార్డులంత గొప్పగా మా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని చెప్పాను. తెలంగాణ జాతి మేలి రత్నం గద్దర్ పేరున గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పాం. కానీ, సినీ ప్రముఖుల నుంచి స్పందన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను.. ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తే.. మా ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతుందని తెలియజేస్తున్నాను' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications