సర్.!చిరంజీవి గారు.!మళ్లీ సినీ కార్మికుల ఆకలి కేకలు షురూ.!ఒక్కసారి సీసీసీ సరుకులు ఇప్పించండి సర్.!
హైదరాబాద్ : రాష్ట్రం స్తంభిచి మూడు వారాలు కావస్తోంది. నాలుగు గంటలు వెసులు బాటు ఉన్నప్పటికి రావాడానికి, పోవడానికి సరిపోతుంది తప్ప ఆ సమయంలో అంతగా వ్యాసారం కూడా చేసుకోలేం. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రంలో సగర్వంగా చెప్పుకునే సినీ కార్మికుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు తెలుస్తోంది. లాక్డౌన్ ఆంక్షలతో మళ్లీ షూటింగ్ లకు బ్రేక్ పడడంతో సినీ కార్మిక లోకం నుండి ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చేసుకోవడానికి పని లేక, కొత్త వృత్తి చేత కాక చాలా మంది సినీ కార్మికులు అనేక సమస్యల్లో చిక్కుకు పోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి వారందరూ అందరివాడు, అన్నయ్య చిరంజీవి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఉపాది కోల్పోయిన సినీ కార్మకులు.. మొదలైన సినిమా కష్టాలు..
సరిగ్గా యేడాది క్రితం ఇదే లాక్డౌన్ సమయంలో ఉపాది కోల్పోయిన కొన్ని వేల మంది సినీ కార్మికులను అక్కున చేర్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా మొదటి దశ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలతో అనేక మంది జీవనోపాది కోల్పోయారు. తినడానికి తిండి లేక అలమటించిన సందర్బాలు కూడా లేకపోలేదు. అంతే కాకుండా సినిమా కార్మికులు సినిమాకు సంబంధించిన పని తప్ప మరో పని చేయడానికి అంత సముఖత చూపరు. సరిగ్గా ఇలాంటి సమయంలో చిరంజీవి వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించారు.
గత లాక్డౌన్ లో ఎంతో మందికి సహాయం.. వేలమంది సినీ కార్మికులను ఆదుకున్న చిరంజీవి..
సంవత్సరం క్రితం తడి ఆరిపోయిన గొంతులను తడిపారు, ఆకలితో అలమటిస్తున్న వారి ఆకలిని తీర్చారు చిరంజీవి. లాక్డౌన్ తో పనిలేక పస్తులుంటున్న సినీ కర్మికుల దుర్బర జీవితాలను చూసి చిరంజీవి చలించిపోయారు. కొంత మంది సినీ పెద్దలను సంప్రదించి కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా దాదాపు నెలకు సరిపోయే 22రకాల నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసారు చిరంజీవి. చిరంజీవి తలపెట్టిన ఈ బృహత్కర కార్యక్రమం వల్ల రెక్కాడితే కానీ డొక్కాడని అనేక మంది సినీ కార్మికుల జీవితాలను నిలబెట్టింది.
ఉపాది లేదు.. ఉద్యోగం లేదు.. సీసీసీ తరుపున సాయం అందించాలంటున్న సినీ కార్మికులు..
ప్రస్తుతం కరోనా రెండో దశ అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. కరోనా సోకిన బాదితులు పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల అడ్డగోలు దోపిడీ చూసి అర్థాంతరంగా గుండె ఆగిపోతున్న అభ్యాగ్యుల గాథలు మాత్రం కరోనా ఖాతాలో పీపీఈ కిట్లలోనే కాలిపోతున్నాయి. మరోపక్క జీవనోపాది లేక అనేక మంది సతమతవుతున్న సందర్బాలు కూడా కలిపిస్తున్నాయి. లాక్డౌన్ నుండి నాలుగు గంటలు వెసులు బాటు ఉన్నప్పటికి ఎలాంటి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలో తెలియక అనేక మంది అగమ్యగోచరంలో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. వేల సంఖ్యలో ఉన్న సినీ కార్మికుల పరిస్థితి మాత్రం వర్ణనాతీతంగా తయారైనట్టు తెలుస్తోంది.
అన్నయ్య స్పందించాలి.. ఆకలి చూపులతో ఎదురు చూస్తున్న సినీ కార్మికులు..
చేతిలో సినిమా షూటింగులకు సంబంధించి పని లేక, వేరే వృత్తి చేయలేక సినీ కార్మికుల పరిస్ధితి దైన్యంగా మారినట్టు తెలుస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో సినీ కార్మికులు మళ్లీ అన్నయ్య చిరంజీవి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో ఇచ్చే నిత్యావసర వస్తువులను మరోసారి పంపిణీ చేస్తే కాస్త ఆసరగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు విధించి మూడు వారాలు పూర్తవుతున్న సందర్బంగా బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ ఐపోయినట్టు, ఇక సినీ కార్మికులకు చిరంజీవి ఒక్కడే ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నట్టు కృష్ణా నగర్ వీధుల్లో చర్చ జరుగుతోంది. మరి మెగాస్టార్ చిరంజీవి ఓ సారి సినీ కార్మికుల వైపు టర్నింగ్ ఇచ్చుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.