ప్రజలను తాగుబోతులను చేయొద్దు, తెలంగాణ ఇందుకేనా?: చుక్కా రామయ్య
హైదరాబాద్: చీప్లిక్కర్ను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలను తాగుబోతులుగా మార్చవద్దని ప్రభుత్వానికి దండం పెట్టి కోరుతున్నానని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు.
ప్రజలపై మద్యం, చీప్ లిక్కర్ రుద్దే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిస్తూ ప్రగతి శీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. పిఓడబ్ల్యు అధ్యక్షురాలు సంధ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చుక్కా రామయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చుకున్నది తాగి ఊగటానికి కాదన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పంటలు సాధించుకునేదిపోయి, లక్ష్యాన్ని విస్మరిస్తూ చీప్లిక్కర్ మీద పడటం బాధాకరమని పేర్కొన్నారు.
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్యం విదానాన్ని మార్చుకోవాలని సూచించారు. మానవ హక్కుల సంఘం నేత జీవన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలన్నీ ప్రక్కనబెట్టి ముఖ్యమంత్రి చీప్లిక్కర్ ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని విమర్శించారు. ఈకార్యక్రమంలో ప్రజా, మహిళాసంఘాల ప్రతినిధులు జ్యోత్స్న, ప్రొ.లక్ష్మణ్ పాల్గొన్నారు.