కేయూ వర్సిటీలో ఘర్షణ: లెక్చరర్ దాడి, ప్రతిదాడి
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ మూల్యాంకనం ప్రసహనంగా మారింది. కేయూ పరీక్షల విభాగంలో కొన్ని రోజుల క్రితం మూల్యాంకనం ప్రారంభమైంది. ప్రారంభమైన రెండవ రోజునుండే మూల్యాంకనానికి రెమ్యూనరేషన్ పెంచాలని ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహించారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది.
దీంతో శనివారం నుండి మూల్యాంకనం ప్రారంభమైనది. శనివారం ఉదయం తొమ్మిది గంటలకే ఉపాధ్యాయులు రాగానే పరీక్షల నియంత్రణాధికారులు గేట్లకు తాళం వేశారు. ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులను లోనికి రానివ్వక పోవడంతో గొడవ ప్రారంభమైంది. చిలికి చిలికి వానగా మారి క్యాంప్ ఆఫీసర్పై దాడి చేసే పరిస్థితికి చేరింది.
ఉదయం తొమ్మిది గంటలకు మూల్యాంకనం ప్రారంభం కాగానే అధికారులు గేట్కు తాళం వేశారు. ఆలస్యంగా వచ్చిన ఆంగ్ల విభాగానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు గేట్ తాళం తీయమని అక్కడి తాత్కలిక ఉద్యోగులను అడిగారు. అక్కడున్న వారు తమకు తెలియదన్నారు. దీంతో అక్కడకు చేరుకున్న క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్ సదరు ఉపాధ్యాయునితో మాట్లాడే క్రమంలో మాటామాటా పెరిగింది.
సదరు క్యాంప్ ఆఫీసర్పై దాడి చేశాడు. దీంతో క్యాంప్ ఆఫీసులో ఉన్న బాయ్స్ ఉపాధ్యాయుడిపై ప్రతిదాడి చేశారు. విషయం తెలుసుకున్న అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకట్రామ్ రెడ్డి కెయు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేయూ పోలీసులు రంగంలోకి దిగి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని నిలిపి వేసి పరీక్షల విభాగం ముందు ధర్నాకు దిగారు.