ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్ - గవర్నర్ ఫీల్డ్ విజిట్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇద్దరూ..!!
గోదావరి వరదలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ముంపుకు గురయ్యాయి. ప్రధానంగా భద్రాచలం పూర్తిగా ద్వీపంగా మారిపోయింది. అనేక గ్రామాలకు సంబంధాలు కట్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే భద్రాచలంకు ప్రత్యేక అధికారులను..ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా హెలికాప్టర్ ద్వారా సేవలు అందిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి పైన రాకపోకలు నిలిపివేశారు. అటు ఎస్సారెస్పీ నిండు కుండలా మారింది. కాళేశ్వరంలో పంపుసెట్లు నీట మునిగాయి. ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ - ముఖ్యమంత్రి పోటా పోటీ పర్యటనలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే
భద్రాచలం - కొత్తగూడెం ప్రాంతం బాగా దెబ్బ తింది. దీంతో..వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేపు (ఆదివారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. అయితే ఇదే సమయంలో గవర్నర్ తమిళసై వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు సిద్దమయ్యారు.
ఈ రాత్రికి కొత్తగూడెం చేరుకొని.. రేపు వరద ప్రభావిత గ్రామాల్లో బాధితులను పరామర్శించనున్నారు. కొంత కాలంగా ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య కొనసాగిన గ్యాప్, కొద్ది రోజుల క్రితం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవ వేళ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లటం. .గవర్నర్ తో వ్యవహరించిన తీరుతో ఆ గ్యాప్ ఇక ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
కొత్తగూడెంకు గవర్నర్
అయితే, ఇప్పుడు ఇద్దరూ తిరిగి ఒకే సమయంలో వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటకు రానుండటంతో అధికారులు ఇరకాటంలో పడనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంతో పాటుగా వరదకు గురైన ప్రాంతాలు.. రిజర్వాయర్లు..బాధితుల పరామర్శ ఉండే విధంగా అధికారులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు సీఎం ఏరియల్ సర్వే కొనసాగనుంది.
ఇక, రేపు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న గవర్నర్ తన పర్యటన రద్దు చేసుకన్నట్లుగా తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాలకు ఈ రాత్రికి చేరుకొని.. అక్కడ పునరావాస శిబిరాల్లో ఉన్న బాధితులను పరామర్శించనున్నారు. భద్రాచలం ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సీఎస్ కు ఆదేశాలు జారీ చేసారు. అక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఒకే సమయంలో..పర్యటనలు
ఇదే సమయంలో ఇప్పుడు సీఎం కేసీఆర్. .గవర్నర్ ఒకే పమయంలో పర్యటనకు వస్తుండటంతో..ఈ పరిణామం ఆసక్తి కరంగా మారుతోంది. వరద తీవ్రత క్రమేణా తగ్గుతూ మూడు నాలుగు రోజుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే, వదర నీటి కారణంగా అంటు వ్యాధులు ప్రబల కుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇక, గవర్నర్ నేరుగా ఏరియా సర్వేకు రానుండటంతో..అధికారుల నుంచి పూర్తి సమాచారం.. నష్టం పైన వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తోంది.