ఆటో కార్మికులకు గుడ్న్యూస్ చెప్పిన కేసీఆర్: కరీంనగర్ పిల్లతోనే పెళ్లి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
కరీంనగర్: తెలంగాణలో ఆటో కార్మికులకు ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కోసం అయ్యే ఖర్చును రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ కు అయ్యే ఖర్చును రద్దు చేస్తామని కేసీఆర్ చెప్పారు. దేశంలో హోంగార్డులకు అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఓటు వజ్రాయుధం లాంటిదని ఉపయోగించే ముందే ఆలోచించి మంచి అభ్యర్థిని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.

'ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. ట్రాఫిక్ పోలీసులు పొద్దాక పొగలో ఉంటరు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్ వారి వేతనంలో ఇస్తున్నాం. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. ఎక్కడ కూడా ఇంత ఇవ్వరు' అని కేసీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలిచావులు తప్ప ఇంకేమీ లేవన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రూ.2కే కిలో బియ్యం ఇచ్చారన్న కేసీఆర్.. కాంగ్రెస్ పాలన బాగుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టి ఉండేదని ప్రశ్నించారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ గుర్తు చేశారు. ఇవన్నీ మీ కళ్ల ముందున్నాయని చెప్పారు. రైతుబీమా, రైతుబంధు, 24గంటలు విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా.. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్ వాళ్లు వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తామంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ధరణి తీసేసి భూమాత పెడతామంటున్నారని.. తిరిగి పట్వారీలను తెస్తామని అంటున్నారని విమర్శించారు. వచ్చే ఐదేళ్లలో భారీగా ఇళ్ల నిర్మాణాలు చేపడతామని.. రానున్న కాలంలో ఇండ్లు లేని పేదలు ఉండకూడదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
కరీంనగర్ పిల్లనే పెళ్లి చేసుకున్న: కేసీఆర్
కరీంనగర్ భీముడు కమలాకర్ మొన్న అన్నడు. మీకు కరీంనగర్కు ఏదో లింక్ ఉన్నది సార్ అన్నడు. లింక్ అయితే ఉన్నదనుకో ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్ పిల్లనే పెళ్లి చేసుకున్న. నేను కరీంనగర్ ఎప్పుడు వచ్చినా ఏదో స్కీమ్ ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్నెస్ ఛార్జి, సర్టిఫికెట్ ఛార్జీలను రద్దు చేస్తాం. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు అందరికీ అన్నీ చేసుకుంటూ పోతున్నామని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications