‘‘వైయస్ అహంకారపూరితంగా మాట్లాడుతుంటే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ముసిముసి నవ్వులు నవ్వేవాళ్లు’’
వరంగల్ లో జరిగిన టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల నిష్రియాపరత్వం వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు.
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావం సందర్భంగా గురువారం రాత్రి వరంగల్ లో టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన 'ప్రగతి నివేదన సభ'లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులను దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నాయకుల నిష్రియాపరత్వం వల్లనే తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తాను ఉద్యమిస్తున్న సమయంలో అప్పటి సీఎం వైయస్ రాజశేఖర రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతుంటే.. ఇక్కడి కాంగ్రెస్ నాయకులంతా ముసిముసినవ్వులు నవ్వేవాళ్లని తెలిపారు.
పదిన్నర నెలల్లోనే భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తిచేశామని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే తమకు పుట్టగతులు కూడా ఉండవన్న భయంతో కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు.
ప్రాజెక్టుల్ని అడ్డుకునేందుకు కోర్టు నుంచి స్టేలు తీసుకొస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులవల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.