చంద్రబాబు చెప్పేవన్నీ తప్పుడు మాటలు: డిండి ప్రాజెక్టుకు కెసిఆర్ శంకుస్థాపన
నల్గొండ: సమైక్య రాష్ట్రంలోనే పాలమూరు, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు ఏపి ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన శుక్రవారం మర్రిగూడెం మండలం శివన్నగూడెంలో డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు.
జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ నుంచి కాపాడాలనేదే తమ లక్ష్యమని అన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా ఇక్కడి ప్రజలకు నీళ్లివ్వాలనే ఉద్దేశంతో 2007లో అప్పటి సిఎం వైయస్, మంత్రి జానారెడ్డిలు ఈ పథకానికి డిపిఆర్ జారీ చేశారని చెప్పారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా డిండి, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు అనుమతులిచ్చిందని తెలిపారు.
కొత్త ప్రాజెక్టులు కాకున్నా.. ఇప్పుడు ఏపిలో ఉన్న టిడిపి ప్రభుత్వం అనుమతులు లేని ప్రాజెక్టులని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ఏడాదైనా ఆంధ్రోళ్ల పంచాయతీ తెగుతలేదని అన్నారు.
ఇక్కడ నీళ్లు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ఏపీ నాయకులు అంటున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పేవన్ని తప్పుడు మాటలని కేసీఆర్ ఆంధ్రా నేతలపై మండిపడ్డారు. రెండేళ్లలోనే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. మన హక్కు మనం తీసుకుందామంటే ఆంధ్రోళ్లు పంచాయితీ పెడుతున్నారని.. ఏపీ మంత్రి దేవినేనిపై ఆయన ధ్వజమెత్తారు. అయినా టీ. ప్రభుత్వం ధైర్యంగా ముందుకుపోయి ప్రాజెక్టు నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు కింద భూమి పోయిన వారందరికీ రూపాయికి ఐదు రూపాయలు ఇస్తామని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు. కావాలంటే భూములు కొనిస్తామని, అందుకోసం రెండింతల డబ్బు చెల్లిస్తామని చెప్పారు. ఇంటికి ఒక ఉద్యోగం, ఇద్దరు చదువుకున్నవాళ్లు ఉంటే ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని కెసిఆర్ చెప్పారు.
ఇక్కడివారికి స్పెషల్ రిక్రూట్ మెంట్ల ద్వారా ఉద్యోగాలిప్పిస్తామని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా మొదటగా శివన్నగూడేనికే నీళ్లందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, ఎంపి నర్సయ్య గౌడ్కు సహకరించాలని కోరారు. మళ్లీ హెలికాప్టర్లో వచ్చి.. ముంపు గ్రామాల ప్రజలను కలుస్తానని అన్నారు.
రూ. 5లక్షలతో డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. కెసిఆర్ మాట చెబితే వందశాతం చేస్తాడని అన్నారు. డిండి శంకుస్థాపనకు శుభసూచకంగా వర్షం కురిసి అక్షింతలు వేసిందని తెలిపారు.