దేశం ఎవడబ్బ సొత్తు కాదు.. రాహుల్ పుట్టుకపై వ్యాఖ్యలు; కుక్కమూతిపిందె బీజేపీ: తరిమికొట్టాలన్న కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోమారు ప్రధాని నరేంద్ర మోడీ పై, బిజెపి పై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాయగిరి బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పిచ్చి ముదిరి మోడీ వ్యవసాయ వ్యతిరేక చట్టాలను తెచ్చారని, ఏడాది పాటు రైతులు ఏడిపించారని, రైతులను గుర్రాలతో తొక్కించారని, కార్లను పైకి ఎక్కించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతులను ఖలిస్తాన్ ఉగ్రవాదులు అన్నారని, దేశ రాజధాని ఢిల్లీ బోర్డర్ లో రైతులు చిత్రహింసలు పెట్టారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
Recommended Video
దేశం క్రిందికి పోతుంటే తెలంగాణా పైకి పోతుంది; భూముల ధరలకు రెక్కలు అందుకే: సీఎం కేసీఆర్
మోడీకి మెంటల్ ఎక్కి రైతులతో పెట్టుకుంటున్నాడు
మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తి పెట్టి విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమని బిజెపి ప్రభుత్వం చెబుతోందని కేసీఆర్ ఆరోపణలు గుప్పించారు. రైతుల తరపున కరెంటు బిల్లు తామే కడతామని పేర్కొన్న కెసిఆర్, మోడీకి మెంటల్ ఎక్కి రైతులతో పెట్టుకుంటున్నాడు అంటూ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీని తరిమి కొట్టాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్న కెసిఆర్ మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేసిందని, ఏ రంగానికి మోడీ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవాలను ప్రశ్నిస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు
మోడీ ప్రభుత్వం తో కొట్లాడాలా? ఇంట్లో పడుకోవాలా చెప్పాలి అని ప్రజలను ప్రశ్నించారు కెసిఆర్. వాస్తవాలను ప్రశ్నిస్తే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని, మా సంగతి ఏం చూస్తారో చెప్పాలని కెసిఆర్ నిలదీశారు. మోడీ ప్రభుత్వం పిచ్చిపిచ్చి పాలసీలు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం ఎవడి అబ్బ సొత్తు కాదని, దేశాన్ని నాశనం చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోమని కెసిఆర్ వెల్లడించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ నుంచి దమ్మున్న ఏ మొనగాడో తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కెసిఆర్ నిలదీశారు. మోడీ వల్ల దేశంలో ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. దేశంలో 15 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని, బీజేపీ పాలనలో దేశం నాశనం అయిందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ సిగ్గుపడాలి
తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారని పేర్కొన్న కెసిఆర్, మతతత్వ పిచ్చి ఉన్న బిజెపి పాలనలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ సిగ్గుపడాలని కెసిఆర్ మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగి నిజం కాదా.. చెప్పాలని మోదీని ప్రశ్నించారు. కర్ణాటకలో మతపిచ్చి లేపారని, కర్ణాటక లో ఏం జరుగుతుందో దేశమంతా చూస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీలో ఆడబిడ్డ మీద విద్యార్థుల మీద దాడులు జరుగుతున్నాయని, విద్యార్థుల మధ్య మత కలహాలను పెడుతుందని కేసీఆర్ విమర్శించారు.
అన్ని రంగాల్లోనూ అట్టర్ ప్లాప్ గవర్నమెంట్ బీజేపీ
అన్నిరంగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ బీజేపీ అని కెసిఆర్ దేశంలోని అధికార బీజేపీ ని టార్గెట్ చేశారు. బీజేపీ దొంగలతో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో 65 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయని, 35 వేల టీఎంసీల నీళ్లు కూడా వాడడం లేదని కెసిఆర్ తెలిపారు. దేశంలో ఆకలి పెరుగుతుంది అన్న కెసిఆర్ 115 దేశాలలో సర్వే చేస్తే భారతదేశంలో 101 వ స్థానంలో ఉందని, భారతదేశాన్ని ఆకలి రాజ్యం గా మారుస్తారా అంటూ ప్రశ్నించారు.
దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె బీజేపీ
తన ప్రాణం తెలంగాణ అని పేర్కొన్న కెసిఆర్ తాను చచ్చినా సరే కేంద్ర విద్యుత్ సంస్కరణలను తెలంగాణలో అమలు చేయబోనని తేల్చి చెప్పారు. జనగామ సభలో తన మాటలకు బీజేపీ నేతలకు లాగులు తడిశాయని కెసిఆర్ పేర్కొన్నారు. బీజేపీకి సంస్కారం ఉందా అని ప్రశ్నించిన కెసిఆర్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టుక పై అస్సాం ముఖ్యమంత్రి తప్పుగా మాట్లాడాడు అని, సంస్కార హీనంగా మాట్లాడిన అస్సాం సీఎం ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె బీజేపీ అని సీఎం కేసీఆర్ తిట్టిపోశారు.