హస్తినకు చేరిన నీటి పంచాయితీ: ఢిల్లీకి కేసీఆర్, మోడీతో చంద్రబాబు భేటీ లేనట్టే
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదం ఢిల్లీకి చేరుకుంది. బుధవారం మధ్యాహ్నాం 2 గంటల ప్రాంతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాలకు చెందిన సీఎంలతో పాటు జలవనరుల శాఖ మంత్రులు, సీఎస్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
బుధవారం మధ్యాహ్నం 2.30 ప్రారంభం కావాల్సిన సమావేశం 2 గంటలకే ప్రారంభమవుతుంది. కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదంపై సుప్రీం కోర్టు ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది.

ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సీఎం కేసీఆర్తో పాటు జలవనరుల శాఖ మంత్రి హరీశ్రావు, సీఎస్ రాజీవ్శర్మ, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో భాగంగా మధ్యాహ్నం 2.25 గంటలకు తెలంగాణ తరుపున సీఎం కేసీఆర్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు సీఎం కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడతారు. మధ్యాహ్నం 3.25 గంటలకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమావేశంలో మాట్లాడతారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన వాదనను గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపైనే నిలదీయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ప్రాజెక్టుల్లో నీటి వాటాలు-పంపకం, కృష్ణా నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్టులు, పట్టిసీమ ప్రాజెక్టులో నీటి వాటా అంశాలను అజెండాగా పొందుపరిచారు.
ఈ అపెక్స్ కౌన్సిల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి బృందం బుధవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ బయల్దేరి వెళ్లనుంది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం షెడ్యూల్ ఇలా ఉంది:
* 2.05 గంటలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు ప్రజెంటేషన్
* 2.15 గంటలకు ఏపీ ప్రజెంటేషన్
* 2.25 గంటలకు తెలంగాణ ప్రజెంటేషన్
* 2.35 గంటల అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ
* 3.15 గంటలకు ఏపీ సీఎం చంద్రబాబు స్పీచ్
* 3.20 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీచ్
* 3.25 గంటలకు కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి స్పీచ్
* సమావేశం అనంతరం ఉమాభారతి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియా సమావేశం
ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ లేనట్టే
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో సమావేశమవుతారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ప్రధాని మోడీతో మాత్రం చంద్రబాబు సమావేశం లేనట్లేనని పార్టీ వర్గాల సమాచారం. బుధవారం కేంద్రం కేబినెట్ సమావేశం జరగనుంది.
ఈ క్రమంలో ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ ఉండదని సమాచారం. కాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు. అయితే బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని చంద్రబాబు కలవనున్నారు. ఈ భేటీలో ప్రత్యేక ప్యాకేజీ విషయమై చర్చించనున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం 2 గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం సాయంత్రం సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర పర్యాటక సదస్సులో బాబు పాల్గొననున్నారు. రాత్రి 7గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.












Click it and Unblock the Notifications