KCR ఆర్థిక దిగ్బంధనంలో కోమటిరెడ్డి?
మునుగోడు ఉప ఎన్నికతో తెలంగాణ అంతటా రాజకీయ వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో భారతీయ జనతాపార్టీ తరఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్వాయి స్రవంతి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ గా బీజేపీ భావిస్తోన్న ఈ ఎన్నికలో ఆ పార్టీని ఓడించడానికి టీఆర్ఎస్ శతథా ప్రయత్నిస్తోంది.

దేశంలోనే అతి ఖరీదైన ఉప ఎన్నికా?
సమీప దూరంలో ఉప ఎన్నికలే లేవు.. అందరూ సాధారణ ఎన్నికల్లో తలపడటమే అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి రాష్ట్ర ప్రజలపై బలవంతంగా ఉప ఎన్నికను రుద్దారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అభ్యర్థుల ప్రచార పర్వంతోపాటు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటుండగానే మరోవైపు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ధనపు రాశులను నియోజకవర్గంలో కుమ్మరిస్తుండటంతో మునుగోడుకు జరుగుతున్న ఉప ఎన్నిక రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు దొరికింది రూ.15 కోట్లు?
ఉప ఎన్నికలో పంచడం కోసం డబ్బులు తరలిస్తుండగా ఎక్కడికక్కడే కోట్లాది రూపాయలు సొమ్ము పోలీసులకు లభ్యమవుతోంది. మునుగోడుకు చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు హైదరాబాద్, విజయవాడ నుంచి మునుగోడుకు దారితీసే మార్గాలన్నింటినీ పోలీసులు దిగ్బంధనం చేశారు. అణువణువునా శోధిస్తున్నారు. పట్టుబడిన సొమ్మంతా ఎవరిది అనే విషయం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ అది మొత్తం కోమటరెడ్డిదేనని వార్తలు వస్తున్నాయి. ఒకరకంగా ఆయన ఆర్థిక వనరులన్నీ అధికార ప్రభుత్వం దిగ్బంధనం చేస్తోందంటున్నారు. హైదరాబాద్ తోపాటు మునుగోడు శివార్లలోను, తాజాగా దొరికిన సొమ్ము కలిపి రూ.15 కోట్లు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆర్థిక దిగ్బంధనంలో కోమటిరెడ్డి?
ఉప ఎన్నిక జరిగే ప్రాంతంలో కోడ్ అమల్లోకి రావడంతో అంతా ఎన్నికల సంఘం అధీనంలో ఉంటుంది. అయితే బలగాలన్నీ రాష్ట్రానివే ఉపయోగిస్తారు. అధికారులుకానీ, పోలీసులుకానీ అందరూ తెలంగాణకు చెందినవారే ఉంటారు. హైదరాబాద్ నుంచి కొంత సొమ్మును ద్విచక్ర వాహనాలపై తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గరి బంధువులదని, అందుకే తీసుకువెళుతున్నామని పట్టుబడినవారు పోలీసులకు చెప్పారు. ఎక్కడ రూపాయి వాసన తగులుతున్నా పోలీసులు పట్టేసుకుంటున్నారు. ఇప్పటివరకు అభ్యర్థి ఖర్చుపెట్టినదానికన్నా ఎక్కువ డబ్బు పోలీసులకు దొరికింది. కోమటిరెడ్డిని ఆర్థిక దిగ్భంధనం చేయాలనుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగానే చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నిక ప్రారంభమయ్యే సమయం ముందు వరకు ఎంత సొమ్ము దొరుకుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications