సీఎం కేసీఆర్ మునుగోడు బహిరంగసభ.. టీఆర్ఎస్ ప్లాన్, 2వేల కార్ల కాన్వాయ్ తో భారీర్యాలీ
తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో, ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే సీఎం కేసీఆర్ సైతం రంగంలోకి దిగుతున్నారు. నేడు మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభలో పాల్గొననున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఈ సభ ద్వారా తమ బలప్రదర్శనకు శ్రీకారం చుట్టింది.
మునుగోడు కెసీఆర్ సభ.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతుందని, వచ్చే ఉప ఎన్నికల్లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ నే అని చెప్పడం కోసం టిఆర్ఎస్ భారీ వ్యూహాన్ని రచించింది. ఈరోజు సీఎం కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ చేసి, ప్రజా మద్దతు తమవైపే ఉందని చూపించే ప్రయత్నం చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ. ఇక సీఎం కేసీఆర్ మునుగోడు సభ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దారులు ఇవి ప్రస్తుతం మునుగోడు వైపు పయనిస్తున్నాయి. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల అందరి దృష్టి ప్రస్తుతం మునుగోడులో సీఎం కెసిఆర్ సభ పైనే ఉంది.

సీఎం కెసీఆర్ కు భారీ కాన్వాయ్ తో ఘన స్వాగతం
ఇక రానున్న ఎన్నికలకు ఎంతో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక టిఆర్ఎస్ పార్టీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే టిఆర్ఎస్ గతానికి భిన్నంగా ప్రస్తుతం మరింత దూకుడుగా ముందుకు వెళుతుంది. ఇక సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి మునుగోడుకు రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడికి చేరుకుని ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. దీంతో మునుగోడు సభ నేపథ్యంలో హైదరాబాద్ నుండి టిఆర్ఎస్ పార్టీ భారీ కాన్వాయ్ తో ర్యాలీగా బయలుదేరాలని ప్లాన్ చేసింది.

రెండు వేల కార్ల కాన్వాయ్ తో హైదరాబాద్ నుండి మునుగోడుకు సీఎం కేసీఆర్
దాదాపు రెండువేల కార్లతో సీఎం కేసీఆర్ కి స్వాగతం పలికి మునుగోడు వరకు ర్యాలీ నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలకటం తోపాటు, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపి, టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పే ప్రయత్నం చేయనుంది టిఆర్ఎస్ పార్టీ. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ కాన్వాయ్ రూట్ మ్యాప్ ను టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీ నగర్, పెద్ద అంబర్పేట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడు కు సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు.

కేసీఆర్ సభ నేపధ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. సభ కోసం పత్యేకంగా ఏర్పాట్లు
అంతేకాదు సీఎం కేసీఆర్ కాన్వాయ్ నేరుగా వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేక రూట్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. ఇక ఈరోజు సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వస్తున్న వారికి ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 100 ఎకరాలలో పది చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

సీఎం కేసీఆర్ బహిరంగ సభ ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న ఆసక్తి
ఇక సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఈ బహిరంగ సభ ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉండబోతుంది అన్నది జాగ్రత్తగా గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ విధమైన ప్రకటనలు చేస్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలంటే తాము ఏ విధంగా ముందుకు సాగాలి అన్నది ఈరోజు సీఎం కేసీఆర్ బహిరంగ సభ తోటి తెలియనుంది. మొత్తానికి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరి కళ్ళు నేడు జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ పైనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు.












Click it and Unblock the Notifications