ధరణి భూసమస్యలపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. పరిష్కారానికి 15నుండి రెవెన్యూ సదస్సులు
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా కెసిఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణాలో పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని భూ సమస్యల పరిష్కారం కోసం కెసిఆర్ ఈనెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో భూ సమస్యలు .. ధరణి పోర్టల్ ను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు
తెలంగాణ రాష్ట్రంలో కొంత కాలం నుండి జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్ ఎట్టకేలకు రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి సారించారు. తెలంగాణా రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా భూ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక పోగా , ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాత మరింతగా పెరిగాయి. ధరణి పోర్టల్ ఏర్పాటుతో కొత్త సమస్యలు వస్తున్నాయని, వాటిని రెవెన్యూ అధికారులు పరిష్కరించడం లేదని ప్రధానంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ధరణి పోర్టల్ ఏర్పాటు విషయంలో అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నారు.
15వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పెండింగ్లో ఉన్న భూ రికార్డులు, భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించడం కోసం ఈనెల 15వ తేదీ నుండి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భూ సమస్యల పరిస్థితి, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అవగాహన కోసం 11వ తేదీన ప్రగతిభవన్లో సదస్సు
మండలం కేంద్రంగా మూడు రోజులకు ఒక మండలం చొప్పున వంద బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్న కేసీఆర్ జాయింట్ కలెక్టర్, డిఆర్వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించిన అవగాహన కల్పించడం కోసం ఈనెల 11వ తేదీన ప్రగతిభవన్లో సదస్సు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అవగాహనా సదస్సుకు సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనుండగా మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు హాజరుకానున్నారు.
భూసమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా కేసీఆర్ నిర్ణయం
భూ సమస్యల కోసం ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడాలని, భూముల సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్రంలో భూముల సమస్యలను పరిష్కరిస్తే ధరణి పోర్టల్ విషయంలో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి, ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టినట్లు అవుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణపై ఫోకస్ చేస్తున్న సీఎం కేసీఆర్ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.