మంత్రి శ్రీనివాస్ను సస్పెండ్ చేయండి, లేదంటే కోర్టులోనే: రఘునందన్ రావు
హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలోమండిపడ్డారు. సీఎం కేసీఆర్ శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయ్యాక వచ్చే సలహాదారు పోస్టు కోసమే డీజీపీ మహేందర్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్కు లైసెన్స్ ఉందా?: రఘునందన్ రావు
మహబూబ్నగర్లో ఏ చట్ట ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ తుపాకి తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారని రఘునందన్ రావు ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఏమైనా లైసెన్స్ ఉందా? అని రఘునందన్రావు నిలదీశారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు డీజీపీ ఆఫీసుకు ఎప్పుడు రమ్మంటారని అడిగారు. మంత్రి పేల్చిన తుపాకిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాలన్నారు రఘునందన్ రావు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ను తప్పించకుంటే కోర్టుకే..: రఘునందన్
లేదంటే రిట్ పిటిషన్ దాఖలు చేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని రఘునందన్రావు కోరారు.‘భారతీయ శిక్షా స్మృతి, రాజ్యాగం ప్రకారం ఈ చట్టాలలో ఎక్కడన్నా ఎస్పీకి ఒక ప్రైవేట్ వ్యక్తికి తుపాకీ ఇచ్చి కాల్చమని చెప్పే చట్టముందా. ఒక బాధ్యత గల మంత్రి తన గన్మెన్ దగ్గర నుంచి తుపాకీ తీసుకున్నారు. దాన్ని కప్పి పుచ్చుకోవాడానికి ఎస్పీ నేనే ఆ తుపాకీ ఇచ్చాను అని చెప్పారు. దీనికి బాధ్యతగా ఎస్పీపై చర్యలు తీసుకోవాలి. శ్రీనివాస్ గౌడ్ను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలి' అని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Recommended Video
తుపాకీతో కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ
కాగా, మహబూబ్నగర్ ఫ్రీడం ఫర్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడం వివాదంగా మారింది. జిల్లా పరిషత్ మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్.. ర్యాలీ ప్రారంభ సమయంలో తుపాకీతో గాల్లోకి ఒక రౌండు కాల్పులు జరిపారు. పోలీసుల తుపాకీతో మంత్రి గాల్లోకి కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మరింది.
అయితే, ఈ ఘటన వివాదానికి దారితీయటంతో.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు. ఫ్రీడం రన్ ప్రారంభోత్సవం వేళ రబ్బర్ బుల్లెట్ తుపాకీని తాను పేల్చినట్లు మంత్రి తెలిపారు. తనకు ఎస్పీనే స్వయంగా తుపాకీ ఇచ్చారన్నారు. గతంలోనూ క్రీడల ప్రారంభోత్సవ సమయంలో రబ్బర్ బుల్లెట్ పేల్చినట్లు చెప్పారు. కొందరు అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.