చిల్కూరు బాలాజీ ఆశీస్సులతో, తెలంగాణ సాధించినట్లే ఇదీ: కెసిఆర్
రంగారెడ్డి: చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శుక్రవారం చెప్పారు. హరితహారం కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం ఓ మహాయజ్ఞం అన్నారు. ప్రతి వ్యక్తి మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు. వికారాబాద్ అనంతగిరిలో ఎంతో అద్భుతమైన అటవీ సంపద ఉండేదన్నారు.
అనంతగిరిలో ఎన్నో ఔషధమొక్కలు ఉండేవన్నారు. ఔషధమొక్కల నుంచి జాలువారి వచ్చిన నీరు గండిపేటకు వచ్చేవన్నారు. అలాంటి నీటితో రోగాలు నయమయ్యేవన్నారు. అలాంటి అడవిని తెలివితక్కువతో మనమే నాశనం చేసుకున్నామన్నారు. గత ప్రభుత్వాల తెలివితక్కువతనంతో వనసంపద కోల్పోయామన్నారు.
హరితహారం అంటే మనిషికి నాలుగు మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడమే అన్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటడం సర్కారు మాత్రమే చేయాల్సిన పని కాదన్నారు. పరిసరాలు శుభ్రంగా లేకుంటే మనకే నష్టమన్నారు.
పరిసరాలు శుభ్రంగా లేకుంటే దోమలు వస్తాయన్నారు. అవి ఎవరినైనా కుడతాయని చెప్పారు. మంత్రిని అయినా, ముఖ్యమంత్రిని అయినా అవి కుడుతాయన్నారు. దోమలు సోషలిస్టులు అన్నారు. కోతులు అడవుల్లో ఉండేవని, ఇప్పుడు అడవులు లేక అవి గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు.

మనం అడవులను కొల్లగొట్టడం వల్లే కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు. గ్రామం బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందన్నారు. మన ఊరును, మన ఇంటిని మనమే పరిశుభ్రం చేసుకోవాలన్నారు. అమెరికా నుండి లేదా పక్కింటోడు వచ్చి శుభ్రం చేయడన్నారు.
రాష్ట్రంలో 33 శాతం పచ్చదనంతో నిండటమే లక్ష్యమన్నారు. నేను కూడా రైతునేనని చెప్పారు. మీరు కూడా పత్రికల్లో మెదక్ జిల్లాలో నాకు వ్యవసాయం ఉన్న విషయం గురించి చదువుతూనే ఉన్నారన్నారు. హరితహారం అంటే తెలంగాణకు ఆకుపచ్చ చెట్ల దండ అన్నారు.
డబ్పులు ఉంటే మాత్రమే సరిపోదాన్నారు. ఖాళీ జాగా ఉంటే చెట్లు నాటాలన్నారు. వచ్చే నాలుగేళ్లలో ప్రతి గ్రామంలో లక్షా 60వేల మొక్కలు నాటాలన్నారు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమం కాదని, ప్రజల కార్యక్రమం అన్నారు.
చిన్నప్పుడు ఎన్నోరకాల పళ్లు అడవుల్లో ఉండేవని, వాటిని తిని కోతులు అక్కడే ఉండేవని, ఇప్పుడు మాత్రం అవేమీ దొరకక కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయన్నారు. కోతులు అడవుల్లోకి వాపస్ వెళ్లేలా చూడాలన్నారు. వన సంపద బాగుంటే మనం బాగుంటామన్నారు.
తెలంగాణకు హరితహారం మహాయజ్ఞం అన్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి రావడం కాదని, కచ్చితంగా ఉండాలన్నారు. ఇది మన బతుకు కోసం మనం చేసే పని అన్నారు.
నేను తెలంగాణ కోసం బయలుదేరిన రోజు తనను ఎందరో ఎగతాళి చేశారని, కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిందని, పట్టుబడితే ఏదైనా సాధ్యమే అన్నారు. అలాగే హరితహారం సాధ్యమన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నారు.
భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని మంచిపనులు తెలంగాణ చేస్తోందన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతోంది తెలంగాణ మాత్రమే అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేదన్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగేస్తున్నామన్నారు.
బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే పచ్చదనం కూడా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక కరెంట్ కోతలు ఉండవని చెప్పారు. ఎంత వ్యవసాయం చేస్తారో చేసుకోవాలన్నారు. రాబోయే రెండేళ్ల తర్వాత 24 గంటల విద్యుత్ ఇప్పించే బాధ్యత నాదే అన్నారు. ప్రజల దీవెనలు ఉంటే ఇలాగే ముందుకెళ్దామన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లీం సోదరుల కోసం రూ.26 కోట్లతో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ రోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో హరితహారం ప్రారంభిస్తున్నామన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చినట్లు.. హరితహారం పైన కూడా అంతే పట్టు ఉండాలన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు భక్తులకు తీర్థం ఇచ్చేటప్పుడు ఓ చెట్టు పెట్టాలని కూడా సూచించాలని, ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. వన సంపద మన సంపద అన్నారు. చెట్లు నాటడం అంటే మన కోసం చేసుకుంటున్న సేవే అన్నారు. రాబోయే రెండేళ్లలో తెలంగాణలో కరువు అనేదే ఉండకూడదన్నారు.












Click it and Unblock the Notifications