Dalit Bandhu: జులై 26న కేసీఆర్ అధ్యక్షతన మొదటి సదస్సు-హుజురాబాద్ వాసులకు ఆహ్వానం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న 'దళిత బంధు' పథకానికి సంబంధించి ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు జరుగుతుంది. పథకం అమలు మొదలు దాని పర్యవేక్షణ,నిర్వహణ వంటి అంశాలపై సదస్సులో సీఎం చర్చించనున్నారు.
ఈ సదస్సు కోసం హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం,మున్సిపాలిటీల నుంచి నలుగురు చొప్పున సదస్సుకు ఆహ్వానించననున్నారు. మొత్తం 412 మందితో సదస్సుతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను కేసీఆర్ తెలుసుకోనున్నారు. వారి అనుమానాలను నివృత్తి చేయనున్నారు.

తొలుత దళిత సాధికారత పేరుతో పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత దళిత బంధుగా దాన్ని మార్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేసి... ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుకు ఏటా రూ. 1,200 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
మొదట హుజురాబాద్ నియోజకవర్గంలోనే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 20,929 దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలుచేసే అవకాశం ఉంది. ఇందుకోసం రూ.2వేల కోట్ల వరకు అదనంగా ఖర్చు చేయనున్నారు. అయితే లబ్దిదారుల ఎంపికకు సంబంధించిన విధి విధానాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఆదివారం నిర్వహించబోయే సదస్సులో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు ఉపఎన్నిక కోసమే దళిత బంధు పథకాన్ని ముందుకు తెచ్చారన్న విమర్శలకు కేసీఆర్ తనదైన శైలిలో జవాబిచ్చిన సంగతి తెలిసిందే. కచ్చితంగా రాజకీయంగా లాభం జరగాలనే స్కీమ్ను తీసుకొస్తున్నామన్నారు. చేయనోడు లాభం కోరుకోవచ్చు గానీ చేసినోడు కోరుకోవద్దా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఏమైనా సన్నాసుల మఠమా అని... రాజకీయ పార్టీనే కదా... వంద శాతం రాజకీయంగా లాభం కోరుకుంటామని తెలిపారు. అంతేకాదు,ఈ పథకాన్ని చూసి కొంతమందికి బీపీ పెరుగుతోందని విమర్శించారు. పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications