ఉప ఎన్నికలకు రేవంత్ సై, కానీ - తాజా సర్వే రిపోర్ట్స్..!?
తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. రాష్ట్రంలో ఉప ఎన్నికల పైన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పైన తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో, సీఎం రేవంత్ క్యాంపు అప్రమత్తం అయింది. తమ ముందున్న ప్రత్యామ్నాయాల పైన కసరత్తు చేస్తోంది. ఉప ఎన్నికలు వచ్చినా సిద్దం కావాలని డిసైడ్ అయింది, సర్వే రిపోర్ట్స్ అధ్యయనం చేస్తోంది. కానీ, అక్కడే మరో అంశం కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది.
కోర్టు ఆదేశాలతో
తెలంగాణలో ఉప ఎన్నికల పైన ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. వీరి పైన నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీని పైన స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. మిగిలిన ఎమ్మెల్యేల పైన అనర్హత పిటీషన్లు స్పీకర్ వద్ద ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అనర్హత వేటు పై ఏం చేయాలనేది కాంగ్రెస్ లో తర్జన భర్జన సాగుతోంది.

ఎలా ముందుకెళ్దాం
హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన డివిజన్ బెంచ్..అవసరమైతే సప్రీంకు వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, అక్కడ ఎలాంటి ఫలితం ఉంటుందనే అంశం పైన న్యాయ నిపుణులతో చర్చలు చేస్తున్నారు. న్యాయ పరంగా ఇలా ఉంటే..సాంకేతికంగా మరో 16 మంది ఎమ్మెల్యేలను తమ వైపు చేర్చుకుంటే బీఆర్ఎస్ చీలిక వచ్చి రాజకీయంగా రేవంత్ దే పై చేయి అవుతుంది. అయితే, తాజాగా హైకోర్టు తీర్పుతో ఇంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారా అనేది సందేహమే.
ఉప ఎన్నికలు తప్పవా
దీంతో, అవసరమైతే ఉప ఎన్నికలకు సిద్దమయ్యే అంశం పైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాకుండానే ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో వచ్చే స్పందన...రాజకీయగా తమకు ప్రస్తుతం ఉన్న పట్టు పైన సర్వే నివేదికలు కోరినట్లు సమాచారం. ఉప ఎన్నికలు ఖాయమైతే ఈ పది మందిలో కొందరు తిరిగి తమ సొంత గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కాలేదు. అయితే, తాము అమలు చేస్తున్న హామీలతో ప్రజల్లో సానుకూలత ఉందనే వాదన ఉంది. కానీ, ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వెళ్తే ఫలితం ప్రతికూలంగా ఉంటే మొత్తానికే మోసం వస్తుందనే ఆందోళన కూడా కనిపిస్తోంది. దీంతో, ఢిల్లీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్తారనేది స్పష్టం అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications