Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాటలతో, మూటలతో ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదు - సీఎం రేవంత్ రెడ్డి

ఈ ప్ర‌భుత్వం మీది.. మీరంతా కోరుకుంటే , ప్ర‌జా పాల‌న రావాలి, ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రావాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష‌తో 2023 ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ.. శిల్పక‌ళా వేదిక‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణలో ఏర్పడిన ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజలదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన రావాలని, ప్రజల జీవితాల్లో మార్పు కలగాలని కోరుకున్న ప్రజల ఆశయాలతోనే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికార యంత్రాంగం, అక్రమ సంపాదనలతో ఎన్నికల్లో పోటీ చేసిన శక్తులు ఒక వైపు ఉంటే, నిజాయితీతో ప్రజల ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో తాము పోరాడి విజయం సాధించామని చెప్పారు.

మాటలతో గానీ, డబ్బుతో గానీ కాదు, ప్రజల నమ్మకంతోనే తమ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య అని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంపై అనేక పోరాటాలు జరిగాయని, కొందరు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని చెప్పారు. ఎన్నో కమిషన్లు, చర్చలు, వివాదాల మధ్య ఈ సమస్య కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. తాను గత 20 సంవత్సరాలుగా ఈ సమస్యను దగ్గరగా గమనిస్తూ వచ్చానని, మాదిగ సమాజం చేసిన ప్రతి పోరాటంలో తనవంతు సహకారం అందించానని తెలిపారు.

cm-revanth-reddy-comments-at-telangana-madiga-employees-coordination-committee-at-hyderabad

ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు అప్పటి పాలకులు తనను సభ నుండి బయటకు పంపించారని కూడా గుర్తుచేశారు. అయినప్పటికీ మాదిగల పక్షాన నిలబడటంలో వెనుకడుగు వేయలేదని స్పష్టం చేశారు. తనకు మహాభారతంలోని కర్ణుడు, బర్బరీకుడు వంటి పాత్రలు ఎంతో ప్రేరణనిస్తాయని, అవమానాన్ని ఎదుర్కొన్న కర్ణుడు ధర్మం కోసం పోరాడినట్లు, బలహీనుల పక్షాన నిలిచిన బర్బరీకుడి లక్షణాలు తనకు ఆదర్శమని తెలిపారు.

మాదిగలు బలహీన వర్గానికి చెందినవారే కాబట్టి వారికి న్యాయం జరగాలని తాను అండగా నిలిచానని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ మాదిగల పక్షాన నిలబడటంలో వెనుకడుగు వేయలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఈ ప్రక్రియలో తన మంత్రి వర్గ సహచరులు, అధికారులు కూడా సమయస్ఫూర్తితో సహకరించారని చెప్పారు. అయితే వర్గీకరణ ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని సీఎం అన్నారు. ప్రమోషన్లు, ఉన్నత విద్య అవకాశాలు, భూముల సమస్యలు, ల్యాండ్ క్యాప్ భూముల పరిరక్షణ వంటి అంశాలపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు ముందుకు రావడానికి విద్య, ఉపాధి అవకాశాలు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లని సీఎం అభివర్ణించారు. ప్రజా పాలనను బలోపేతం చేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని చెప్పారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై కూడా ఆయన ప్రస్తావించారు. ప్రతి నెలా సుమారు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో నెలకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం సమన్వయంతో వ్యవస్థను నడుపుతూ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని చెప్పారు.

cm-revanth-reddy-comments-at-telangana-madiga-employees-coordination-committee-at-hyderabad

ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా ముఖ్యమని సీఎం అన్నారు. అక్రమాలను అరికట్టి ప్రభుత్వ ఖజానాకు నిధులు తీసుకొస్తే ఆ డబ్బుతో మరింత మందికి సంక్షేమం అందించవచ్చని తెలిపారు. గతంలో జమీందారులు, జాగీర్దారుల చేతుల్లో వేల ఎకరాల భూములు ఉండేవని, అసైన్డ్ భూముల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వానికి భూములు పరిమితంగా ఉన్నాయని, ఆర్థిక వెసులుబాట్లు కూడా పరిమితంగానే ఉన్నాయని సీఎం వెల్లడించారు. అయినప్పటికీ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా మాదిగ సమాజం ఇంకా అత్యంత వెనుకబాటులో ఉందని, వారికి విద్య ద్వారా శక్తి కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు డైట్ చార్జీలు, ఇతర సదుపాయాలను పెంచినట్లు చెప్పారు. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేద కుటుంబాల పిల్లలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావచ్చని సీఎం అన్నారు. గత ప్రభుత్వాలు గొర్రెలు, బర్రెలు, చేపలు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాయని పేర్కొంటూ, తాము మాత్రం సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా విద్య, ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. చెప్పులు కుట్టుకునే జాతి ఈ దేశాన్ని నడిపించే స్థాయికి చేరాలని, వారు ఉన్నత స్థానాల్లోకి రావాలని తన ఆశయమని వెల్లడించారు.

తనను కొందరు రేవంత్ మాదిగ, రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజ్, రేవంతుద్దీన్ వంటి పేర్లతో పిలిచారని గుర్తుచేస్తూ, ఎవరు ఎలా పిలిచినా తనకు అభ్యంతరం లేదన్నారు. తాను అందరి వాడినని, ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికే వినియోగిస్తానని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయడం, వారి హక్కులను చట్టబద్ధంగా కాపాడడం తన ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తనకు ఉన్న శక్తి మేరకు ప్రతి వెనుకబడిన వర్గానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలను నెరవేర్చడమే తన రాజకీయ జీవితంలోని ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+