అంతా చెత్తగాళ్లు..దిక్కుమాలినోళ్లు!!
మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన వివాదాలు, పార్టీలో నెలకొన్న సంక్షోభం, ఎమ్మెల్సీ కవిత రాజీనామా వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసీఆర్ చేపట్టిన కక్షసాధింపు చర్యల కర్మ ఫలితం.. ఇలా తిప్పి కొట్టిందని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడటం వల్ల వచ్చిన సొమ్మును పంచుకోవడంలో వచ్చిన తేడాలే ఆ కుటుంబంలో కలహాలకు దారి తీశాయని పేర్కొన్నారు.
తన హయాంలో కేసీఆర్.. అనేక కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని, రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదనేలా వ్యవహరించారని రేవంత్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో కాదు కదా.. రాజకీయాల్లో కూడా ఉండనివ్వకుండా అక్రమ కేసులు బనాయించి ఎంతోమందిని జైలుకు పంపించారని విమర్శించారు. ఇప్పుడు వాళ్లకు వాళ్లే తన్నుకుని ఛస్తున్నారని, ఒకరికొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే వాళ్లని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కుటుంబాన్ని పొడవడానికి ఎవరూ అక్కర్లేదని, వాళ్లకు వాళ్లే పొడుచుకుంటున్నారని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. విపరీతంగా అవినీతికి పాల్పడటం వల్ల వచ్చిన సొమ్మును పంచుకోవడంలో వచ్చిన తేడాలే ఆ కుటుంబంలో కలహాలకు దారి తీశాయని చెప్పుకొచ్చారు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావా అని పెద్దలు ఊరికే చెప్పలేదని, చేసిన పాపాలు ఎక్కడికీ పోవనీ రేవంత్ అన్నారు.
తెలుగుదేశం పార్టీనీ ప్రస్తావించారాయన. టీడీపీని ఓ అద్భుతమైన పార్టీగా అభివర్ణించారు. కొంతమంది కుట్రల వల్ల తెలంగాణలో సమస్యలను ఎదుర్కొంటోందని రేవంత్ అన్నారు. కవిత రాజీనామా, కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన సంక్షోభం వెనుక తాను ఉన్నట్లు జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. హరీష్ రావు, సంతోష్ రావు, కవిత వెనుకల రేవంత్ ఉన్నారంటూ చెప్పడంలో అర్థం లేదని అన్నారు.
అంత చెత్తగాళ్ల వెనుక నేను ఎందుకుంటనయ్యా అని వ్యాఖ్యానించారు. తనకొక పార్టీ ఉందని, ఆ పార్టీ నాయకులకు తోడుగా ఉంటానని పేర్కొన్నారు. వాళ్లందరూ దిక్కుమాలిన వాళ్లనే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు బండకేసి కొట్టారని, అలాంటి వాళ్ల వెనుక ఎవడైనా ఉంటాడా?, అన్నం తినేవాడెవడైనా వాళ్లకు తోడుగా ఉంటాడా? అని ప్రశ్నించారు. వాళ్ల వెనుక ఉండేంత సమయం తనకు లేదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అండగా ఉంటున్నానని పేర్కొన్నారు.
కుటుంబ, కుల పంచాయతీల్లో తనను లాగొద్దని అన్నారు. ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ కుటుంబం కాలం చెల్లిన రూ.1,000 నోటు వంటి వాళ్లని చెప్పారు రేవంత్. జనతా పార్టీ మాదిరిగా క్రమంగా బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని అన్నారు. ఎన్నో దుర్మార్గాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ గానీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు గానీ ఎలా మనుగడ సాగిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications