'రైతుబంధు'పై సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చడంతోపాటు ఆర్థిక సాయాన్ని కూడా పెంచనుంది. వర్షాకాలం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జూన్ లో రుతుపవనాలు వచ్చిన తర్వాత సాగు మొదలవుతుంది. ఆ సమయంలో వ్యవసాయనికి అవసరమైన పెట్టుబడిని అందజేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. కేవలం సాగు భూములకే ఈ సాయాన్ని అందజేస్తున్నారు.
గత ప్రభుత్వ హయంలో కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. ఆర్థికంగా బలమైన వ్యక్తులకు కూడా రైతు బంధు ఇవ్వడంపై విమర్శలు వస్తుండటంతో అర్హులైనవారికి అందజేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. వచ్చే వర్షాకాలం నుంచి రైతుబంధు పథకం పేరు రైతు భరోసాగా మారుతోంది. పెట్టుబడి సాయాన్ని కూడా ఎకరాకు రూ.10వేల నుంచి రూ.15వేలకు పెంచుతున్నారు. రైతులకు, కౌలు రైతులకు ఇద్దరికీ పెట్టుబడి సాయం అందనుంది.

రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు, పెట్టుబడికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. భూమి ఉన్న ప్రతి రైతుకు సాయాన్ని అందించారు. గత వర్షాకాలం వరకు సీజన్ కు రూ.72,910 కోట్లను అందజేసింది. రేవంత్ ప్రభుత్వం కూడా రైతుబంధును యాసంగిలో కొనసాగించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు పథకాలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచడం, రూ.500కే సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తోంది.












Click it and Unblock the Notifications