పనులెలా సాగుతున్నాయ్..!!
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాల్లో ఒకటి- తెలంగాణ తల్లి భారీ విగ్రహం నిర్మాణం. హైదరాబాద్ సచివాలయంలో ఈ విగ్రహం నిర్మితమౌతోంది. దీని నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
డిసెంబర్ 9వ తేదీ నాటికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాలని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా- అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో తెలంగాణ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన వేడుకలనూ నిర్వహించనుంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ చీఫ్ సోనియా గాంధీ జన్మదినం కూడా కలిసి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అదే నెల 7,8,9 తేదీల్లో రాష్ట్రవ్యాప్త ఉత్సవాలను జరుపుకోనుంది. ఇందులో భాగంగా ట్యాంక్బండ్పై ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది.
రాష్ట్ర సచివాలయంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పనులను రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా పర్యవేక్షించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. పనులు ఎలా సాగుతున్నాయంటూ ఆరా తీశారు. సుమారు అరగంటకు పైగా ఆయన అక్కడే కలియతిరిగారు.
దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ను తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల ప్రజల ప్రేమమూర్తి, తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు శరవేగంగా జరుగుతోన్న పనులను పరిశీలించానని, ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకుంటున్న శ్రమ జీవులతో, పనులు జరుగుతున్న తీరు, ఇతర అంశాలపై గురించి కాసేపు ముచ్చటించానని రాశారు.












Click it and Unblock the Notifications