తెలంగాణ గవర్నర్తో సీఎం రేవంత్ భేటీ: ఇక కేబినెట్ విస్తరణేనా?
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులతో కలిసి రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్కు సీఎం రేవంత్, మంత్రులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత గవర్నర్ తో సమావేశమయ్యారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణ గురించే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్ తో సీఎం సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఉగాది తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా నలుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 15 నెలలుగా కేబినెట్ విస్తరణ పెండింగ్ లో ఉండటంతో ఇక ఎంత మాత్రమూ ఆలస్యం చేయకుండా వెంటనే విస్తరణ చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్ సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యి మంత్రివర్గ విస్తరణపై కీలకంగా చర్చించినట్లు తెలిసింది.
సామాజిక సమీకరణలు, కులాలకు తగిన ప్రాధాన్యత పరిగణలోకి తీసుకుని మంత్రి పదవులను భర్తీ చేయాలని నిర్ణయించాయి. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిథ్యం లేకపోవడంతో ఆ జిల్లాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications