తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు: సీఎం రేవంత్ సూచనలతో తుది రూపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధికార చిహ్నం తుది మెరుగులు దిద్దడంతోపాటు మార్పులు చేర్పులు చేస్తోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం రాష్ట్ర అధికార చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. రాజేశం బృందంతో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా, వాటిలో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని తుది మార్పులను సూచించారు.
కాగా, గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్న విషయం తెలిసిందే. అయితే రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించాలని సీఎం రేవంత్ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 2న నూతన రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు కూడా పూర్తయైనట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాలకు కవి అందెశ్రీ మార్పులు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కవి అందెశ్రీ సూచనలకు అనుగుణంగా ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరకల్పన చేశారు. అధికార గీతాన్ని కూడా రాష్ట్ర ఆవిర్భావం రోజైన జూన్ 2న ఆవిష్కరించనున్నారు.
మరోవైపు, తెలంగాణ తల్లి రూపానికి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చిన రేవంత్ ప్రభుత్వం.. టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు కోరారు. చిహ్నం మార్పు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
కాకతీయ తోరణం, చార్మినార్కు మించిన ప్రత్యామ్నాయం వేరేది ఏదైనా ఉందా? అని బీఆర్ఎస్ ప్రశ్నించింది. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన కాకతీయ రాజులు, ఓరుగల్లు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్ని అత్యంత అద్భుతంగా పాలించారని, చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ అని అలాంటి చిహ్నాన్ని మారుస్తాననడం సరికాదని గట్టిగా వాదిస్తోంది.












Click it and Unblock the Notifications