గ్రేటర్ పౌరసేవల్లో విప్లవాత్మక మార్పులు
Revanth Reddy: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ సులభతరంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి పూర్తి అధ్యయనంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పౌర సేవలు, అనుమతులపై రాష్ట్ర సచివాలయంలో ఈ సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తులు చేసుకొని ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నారు.

ఏవైనా నిర్మాణాలు లేదా గృహాలు, వాణిజ్య సముదాయాలకు అవసరమైన సేవలకు ఒకే ప్లాట్ఫామ్ పైకి తీసుకుని వచ్చేలా దరఖాస్తు అందజేస్తే వారికి అవసరమైన సేవలన్నింటికి సింగిల్ విండోలో అనుమతి లభించేలా ఉండాలని సూచించారు. ఇందుకు రెవెన్యూ, పురపాలక, జల వనరులు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ తదితర విభాగాలు సంయుక్తంగా పని చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆయా శాఖల వసూలు చేసే బిల్లుల సైతం ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానం ఉండాలని చెప్పారు. వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని ఆయా విభాగాల ఖాతాల్లో జమ అయ్యే విధానాన్ని రూపొందించాలని, ఈ క్రమంలో ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. దీన్ని మరింత సులభతరం చేయడానికి అవసరమైన అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పౌర సేవలు మెరుగ్గా అందడానికి వివిధ శాఖల విభజనలో ఏకరూపత ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. అనుమతుల ప్రక్రియలో అనవసరమైన జాప్యం చేయకూడదని, ఏ కారణం లేకుండా అనుమతులను నిరాకరించడానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ అనుమతులకు ఆలస్యమైతే అందుకు కారణాలు ఏమిటో దరఖాస్తుదారులకు తెలియజేయాలని అన్నారు.
అలాగే- ఆ జాప్యాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా అధికారులే దరఖాస్తుదారులకు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్రపురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు.
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఆర్ వి కర్ణన్, హెదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఈవీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ రీజియన్ లో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీపడాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి ఆదేశించాను. వీటి పరిరక్షణ కోసం అవసరమైతే లైడార్ సర్వే నిర్వహించాలని చెప్పారు. మ్యాపింగ్ సైతం చేయాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications