ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: అటు పార్లమెంట్, ఇటు ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. సోమ, మంగళవారం ఢిల్లీలోనే ఆయన ఉండనున్నారు. పార్లమెంట్ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతోపాటు ముఖ్యమంగా మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే కాంగ్రెస్ పార్టీ అధిష్థానంతో అవకాశం ఉంది.
పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ త్వరలోనే మంత్రివర్గం విస్తరించనున్నట్లు సమాచారం. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి వారితో చర్చించినట్లు తెలిసింది.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిథ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటు లభించలేదు.
మొత్తంగా మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉండగా.. ప్రస్తుతం నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు ఎవరైనా వస్తే వారికి మంత్రి పదవి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని సమాచారం.












Click it and Unblock the Notifications