తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి: సంచలన నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
ఆకుపచ్చ చీర, గుండుపూసలు, హారం, ముక్కుపుడక, కడియాలు, మెట్టలతో పాటు చాకలి ఐలమ్మ, సమ్మక్క-సారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు, ఆ తల్లి చేతిలో కనిపించేలా రూపకల్పన చేశారు. కవి అందెశ్రీ తోపాటు పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు.

తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారిక ఆమోదం: ఉత్తర్వులు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగులో ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి.. చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాల్లో మాటలు, చేతలతో అగౌరర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొంది.
ఇక నుంచి డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సాంస్కృతిక, సంప్రదాయక, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు, సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. "చరిత్ర ఉన్నంతవరకు తెలంగాణ ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయే అంశాన్ని ఈ రోజు మీ అనుమతితో నేను పవిత్ర శాసనసభలో ప్రస్తావిస్తున్నానని.. పేర్కొంటూ.. "నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ తల్లి కంజాత వల్లి.. అన్న మహాకవి దాశరథి మాటలు నిత్య సత్యాలు తెలంగాణ జాతికి నిరంతర స్ఫూర్తి వ్యాఖ్యలు. ఈ భూ ప్రపంచంలోని ఏ జాతికైనా గుర్తింపు గౌరవం ఆ జాతి అస్తిత్వమే. అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications