CM Revanth Reddy: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం మహబూబ్ నగర్లో పర్యటించారు. చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్లోని కురుమూర్తి స్వామిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి కురుమూర్తి ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, అధికారులు ఘనంగా స్వాగతించారు. ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం పలువురు మంత్రులతో కలసి కురుమూర్తి స్వామని దర్శించుకున్నారు.
అనంతరం అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం ఆలయ సమీపంలో ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కురుమూర్తిస్వామి ఆలయంలో సంపూర్ణ వసతులు లేవనే విషయం తన దృష్టికి రావడంతో రూ.110 కోట్లతో పైకి దారిని నిర్మిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. పేదల తిరుపతిగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తామన్నారు. అలాగే మన్నెంకొండ జాతరను, స్థానిక ఆలయాల్లోని అన్ని జాతరలను తాము గొప్పగా నిర్వహిస్తామని ప్రకటించారు.

గత ప్రభుత్వంలో కానీ పాలమూరు జిల్లా వలసలకు మారుపేరుగా నిలిచిందని సీఎం గుర్తు చేశారు. తట్టపని, మట్టి పని చేసుకుంటూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశారు కానీ ఇక్కడ మన ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి విచారించాల్సి అవసరం ఉందన్నారు. 2009లో కేసీఆర్ను పాలమూరు ప్రజలు గెలిపించి పార్లమెంట్కు పంపించినా ఆయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయిందన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోల్చారని గుర్తు చేశారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మనందరిదీ అని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఇతర నాయకులు ఉన్నారు.












Click it and Unblock the Notifications