పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సిగాచి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారని అధికారులు ధృవీకరించారు. ఇంకా శిథిలాల కింద మరో 27 మంది ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. హాస్పిటల్లో చికిత్స పోందుతున్న వారిలో 11 మందికి విషమంగా ఉందని సమాచారం. సీఎం రేవంత్ ఘటన జరిగినప్పటి నుంచి అక్కడ జరుగుతున్న సహాయ చర్యల గురించి ఆరా తీస్తూనే ఉంటున్నారు. ఇప్పుడు ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. మరికొద్దిసేపట్లో హస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నారు. అలాగే వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకోనున్నారు.
కాగా ప్రమాద స్థలాన్ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఉన్నారు. సీఎం అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రమాద ఘటనపై విచారణను మరింత వేగవంతం చేయాలని, ప్రత్యేక కమిటీని నియమించి తక్షణ నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై క్లారిటీ అవసరమని, ఊహాజనిత సమాధానాలు వద్దని అధికారులను గట్టిగా హెచ్చరించారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో బాయిలర్ల పనితీరు ఎలా ఉందో.. అవసరమైన తనిఖీలు జరిగాయా అనే అంశాలపై ప్రశ్నలు వేశారు.
అంతే కాకుండా ఇలాంటి విషాద సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పకడ్బందీగా పాటించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరణించిన కార్మికులకు ఇన్సూరెన్స్ ఉందా అనే విషయంపై విచారణ జరిపించాలని అధికారులకు సూచించారు.
ప్రమాదంలో చనిపోయిన వారికి లక్ష రూపాయలు, చనిపోయిన వారికి 50 వేలు తక్షణ సాయం ప్రకటించారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని.. అవసరమైన అన్ని మెడికల్ సపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. మరోవైపు సహాయక చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో SDRF, సింగరేణి టీమ్స్ పాల్గొంటున్నాయి. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య వెల్లడించారు.












Click it and Unblock the Notifications