హరీశ్ రావుకు దెబ్బలు పడతాయ్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై సరదాగా పలు వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లాక హరీశ్ రావును వాళ్ల మామ కొరడాతో కొడతారని అన్నారు. దీంతో సభలోని సభ్యుల ముఖాల్లో నవ్వులు పూశాయి.
ఔటర్ రింగ్ రోడ్డు(ORR) విక్రయంపై విచారణ, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో విచారణ కోరి నువ్వే కేటీఆర్ను ఇరికించావని హరీశ్కు కొరడా దెబ్బలు పడతాయి. ఇంటి దగ్గర హరీశ్ కు కొరడా దెబ్బలు కామనే. హరీశ్ తన నిజాయితీ నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి చొక్కాలు చించుకునే పని చేస్తుంటారంటూ రేవంత్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మార్షల్స్ను తోసుకుంటూ హరీశ్ రావు.. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. సభలో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు, ఎంఐఎం సభ్యులు సమన్వయం చేస్తారన్నారు.
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్పప్పుడు కూడా సమన్వయం చేసేవారని రేవంత్ చెప్పుకొచ్చారు. అయితే, ఈరోజు వారు చెప్పినా కూడా వినడం లేదన్నారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇలా చేసినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడారని బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.
అంతేగాక, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఓడారని.. ఆ తర్వాత హైదరాబాద్ కోల్పోయారు.. కొన్నాళ్లు ఉంటే మెదక్ కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందేమో అని బీఆర్ఎస్కు చురకలు అంటించారు. కాగా, ఓఆర్ఆర్పై సిట్ దర్యాప్తునకు సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ధరణి పోర్టల్ స్థానంలో రేవంత్ ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చింది. నేటి సమావేశంలో భూభారతి బిల్లుకు ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications