రేవంత్ Vs కేసీఆర్ - మరో సమరానికి సై..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన సీఎం రేవంత్ ఫోకస్ చేసారు. ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన ఏడాది పూర్తవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో, ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారుతోంది. దీంతో, ఈ రోజు ఎన్నికల పైన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
రేవంత్ సమావేశం
తెలంగాణలో స్థానిక ఎన్నికల సమరం మొదలవుతోంది. అయితే, ముహూర్తం పైన ఈ రోజు స్పష్ట త వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మంత్రులు, అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో, బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ రోజు సమావేశంలో ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత రిజర్వేషన్ల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాతనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం.

ముహూర్తం ఎప్పుడు
తాజాగా పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు స్పష్టం చేసారు. అయితే, ఫిబ్రవరిలోనే ఈ ఎన్నికలు ఉంటాయనే చర్చ మొదలైంది. కానీ, సాంకేతికంగా ఉన్న సమస్యల పైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో పరీక్షల అంశం కూడా కీలకంగా మారుతోంది. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిలో 4 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్లో ఇంటర్, డిగ్రీ పరీక్షలు, మే నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. ఆ తరువాత వేసవిలో వచ్చే సహజమైన సమస్యలు ఎన్నికల నిర్వహణ.. ఫలితాల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది. నీటి ఎద్దడి, విద్యుత్ కోతలు వంటివి ప్రతిపక్షాలకు అవకాశం మారే ఛాన్స్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఎన్నికల సమరం
దీంతో, ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్తారా.. లేక జూన్ తరువాత నిర్వహిస్తారా అనేది ఈ భేటీలో స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు.. తాజాగా నాలుగు పథకాలను అమలు చేయటం ప్రారంభించటంతో ప్రస్తుత గ్రామీణ వాతావరణం రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో, ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో, ఇప్పుడు ఎన్నికల సమరం తెలంగాణలో మరోసారి రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications