కిషన్ రెడ్డి, టాలీవుడ్ నిర్మాతపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం కేంద్ర కేబినెట్ ముందుకు రాకుండా కిషన్రెడ్డి అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు. ప్రధాని మోడీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధానితో భేటీ సందర్భంగా 5 ప్రధాన అంశాలపై విజ్ఞప్తి చేసినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్రోడ్ కమ్ రైలు ప్రాజెక్టు, డ్రైపోర్టు, రక్షణ రంగ ప్రాజెక్టులకు సహకరించాలని కోరినట్టు వెల్లడించారు.
కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టనర్.. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు రేవంత్. మెట్రో విస్తరణలో తనకు పేరు వస్తుందని, కేసీఆర్ హయాంలో ఇది జరగలేదు కాబట్టి.. తన హయాంలో జరగవద్దు అని కిషన్ రెడ్డి భావిస్తున్నారన్నారు. అందుకే కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ ప్రాజెక్టును క్యాబినెట్ లో అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రధానికి ఇచ్చిన విజ్ఞప్తులను బాధ్యత వహించి కేబినెట్ ఆమోదం తేవాల్సిన బాధ్యత కిషన్రెడ్డి, సంజయ్లదే అని సీఎం ప్రస్తావించారు.

మెట్రో విస్తరణ కేబినెట్ ముందుకు రాకుండా కిషన్రెడ్డి అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి సాధించుకుని వస్తే ఆయనకు బహిరంగ సభ పెట్టి సన్మానం చేస్తామని.. గండపెండేరం తొడుగుతానని తెలిపారు. ఐదు ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రం తరఫున విడుదల చేయాల్సిన నిధులకు సంబంధించిన రిప్రెజెంటేషన్ ప్రధాని ఇచ్చారని వివరించారు. గత పది ఏళ్లలో పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లను మంత్రులను చేస్తే ఉప ఎన్నికలు రాలేదని, ఇప్పుడు ఉప ఎన్నికలు ఎలా వస్తాయన్నారు. లెజిస్టేచర్ పార్టీ విలీనం అనేది లేదని, పార్టీనే సుప్రీమ్ అన్నారు రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై సీబీఐ విచారణ వేస్తే.. ఆ వంకతో బీజేపీలో కలిసిపోవచ్చు అనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అంతేకాకుండా ప్రధానితో కులగణనపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బిల్ చేశాక చర్చిద్దాం అనుకుంటున్నాం.. నదులను పునరుద్ధరణ చేయడం మంచి ఆలోచనని ప్రధాని అన్నారన్నారు. గత ప్రభుత్వ అవినీతిపై కమిషన్లు వేశామని.. కమిషన్ల నివేదిక వచ్చాకే ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
కేటీఆర్పై విమర్శలు..
దుబాయ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్, ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి ? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదని.. రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు. కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉందన్నారు. కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు.. ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని రేవంత్ చెప్పారు.












Click it and Unblock the Notifications