అక్టోబర్ 5న సింగరేణిలో సంఘం ఎన్నికలు?: యువ కార్మికులే కీలకం
త్వరలో సింగరేణిలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు కదులుతున్నాయి.
హైదరాబాద్: త్వరలో సింగరేణిలో జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు కదులుతున్నాయి. కొత్తగా చేరిన యువ కార్మికులను ఆకట్టుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తూ వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాలే భవిష్యత్లో తమ ఉనికిని చాటుకునే అవకాశం ఉండటంతో సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో విజయంపైనే గురిపెట్టి పావులు కదుపుతున్నాయి. విజయానికి అవకాశం ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాయి.
విజయానికి అవసరమైన కార్మికులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో తలమునకలు అవుతున్నాయి. ముఖ్యంగా యూనియన్లను బలోపేతం చేసుకోవడానికి చేరికలపై దృష్టి సారించాయి. గనుల వారీగా కొత్తగా కార్మికులను తమ యూనియన్లో చేర్చుకోవడం ద్వారా ఆ గనిలో బలం పెంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్న సంఘాలు ఆ దిశగా దృష్టి సారించాయి. సింగరేణి ఆరో విడత ఎన్నికల్లో పోటీకి 16 కార్మిక సంఘాలు అర్హత సాధించాయి.
ఇందులో ప్రధానంగా మూడు సంఘాల మధ్యే పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. మిగతా సంఘాలు నామమాత్రంగా ఉనికిని చాటుకునే అవకాశం ఉన్నా విజయం కోసం ఆయా సంఘాలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ప్రతి గనిలో కొంత మంది కార్మికులను వారి వారి సంఘాల్లో చేర్పించుకుంటున్నారు. దీని వల్ల ఆ సంఘం బలం పెరిగి గనిపై ఓట్లు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి.

గతంలో ఎన్నికల బరిలో నిలిచిన అనుభవం ఉన్న సంఘాలు ఈ సారి మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. సీనియర్ కార్మికులు ఉద్యోగ విరమణ పొందడటంతో ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశం ఉంది. దీంతో కార్మిక సంఘాలు నిబద్ధత గల ఉన్న కార్మికులను సమీకరించే ప్రయత్నం చేస్తున్నాయి.
పట్టుకోసం పాకులాడుతున్న కార్మిక సంఘాలు
ముఖ్యంగా గనులపై పిట్ కమిటీలను పటిష్టం చేయడం ద్వారా ఓటు బ్యాంకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న సంఘాలు కమిటీ సమావేశాలను పెంచాయి. గనిపై ఒక సంఘానికి సంబంధించిన కమిటీని నియమించి వారి ద్వారా ఆ గనిపై ప్రచారం చేయడతో పాటు తోటి కార్మికులను తమవైపు ఓటుగా మలిచేందుకు వారి ద్వారా ప్రయత్నించవచ్చని భావిస్తున్న సంఘాలు పిట్ కమిటీలపై దృష్టి సారించాయి. అసలే పిట్ కమిటీలు లేని సంఘాలు ప్రస్తుతం గనులపై నాయకులను గుర్తించి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు.
దీంతో పాటు ఇతర కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను తమ యూనియన్ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇతర సంఘాల నాయకులను తమ యూనియన్లో చేర్పించుకోవడం ద్వారా ఎదుటి సంఘాన్ని బలహీనపరిచే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గనులపై పిట్ కమిటీలను నియమించి వారి ద్వారా తమ సంఘానికి పట్టు నిలుపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సెప్టెంబరు 14 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానున్న నేపధ్యంలో అప్పటి నుంచి మరింత వేగంగా ప్రచారం చేపట్టే అవకాశం ఉండటంతో ఆలోగా తమకంటు గనులపై ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి కార్మిక సంఘాలు అడుగులు వేస్తున్నాయి.

యువ ఉద్యోగులపై దృష్టి సారించిన సంఘాలు
ఆరో విడత జరిగే ఎన్నికల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన యువ ఉద్యోగులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు యువ ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కార్మిక సంఘాలు వారితో సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. సింగరేణిలో గడిచిన రెండేళ్లుగా 6 వేల మందికి పైగా కొత్త ఉద్యోగులు చేరారు. జేఎంఈటీలతో పాటు వారసత్వ ఉద్యోగాల ద్వారా మరి కొందరు, సాంకేతిక సిబ్బంది, ఫోర్మెన్, ఛార్జీహ్యాండ్ సూపర్వైజర్ కేడర్లలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నారు.
ఈ ఎన్నికల్లో వారి ఓట్లపైనే కార్మిక సంఘాల భవిష్యత్ ఆధారపడి ఉండటంతో అన్ని కార్మిక సంఘాలు వారిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. సీనియర్ కార్మికులంతా ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది తటస్థంగా ఉండటంతో వారి ఓట్లు ఎటువైపు మళ్లితే వారికే విజయ అవకాశాలు ఉంటాయి. దీంతో వారిని సాధ్యమైనంత మేరకు తమవైపుకు తిప్పుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి నిబంధనల ప్రకారం వర్తించే హక్కులు, అమలు చేయకుండా ఉన్న సమస్యలను వారి ముందుకు తీసుకువచ్చి విజయం సాధిస్తే తప్పకుండా వాటిని అమలు చేయిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications