Weather Update: రాష్ట్రంలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. !
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ పేర్కొంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీల సెల్సియస్కు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉష్ణోగ్రతల తగ్గుదల బుధవారం వరకు కొనసాగుతుందని తెలిపింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
నగర శివారుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడుతుంది. హైదరాబాద్లోని మారేడ్పల్లిలో అత్యల్పంగా 14.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి, రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెల్లవారుజామున కనిష్ఠంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అందుకే రాత్రి సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. తెల్లవారుజామున కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

చలి తీవ్రత కారణంగా ఉదయం వాకింగ్ కు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. చలితో వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్లే వారు చెవులకు గాలి తగలకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. మందపాటి దస్తులు ధరించాలని వివరిస్తున్నారు. ముఖ్యంగా అస్తమా ఉన్న వారు చలి కాలం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గుతోంది. ఈ వారంలో గతం కనిష్ట విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుంది.
మరోవైపు లా నినా పరిస్థితులు ఈ సంవత్సరం భారతదేశానికి అనూహ్యంగా కఠినమైన శీతాకాలాన్ని తీసుకురావచ్చని IMD గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఎల్ నినోకు వాతావరణ ప్రతిరూపమైన లా నినా, పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాల శీతలీకరణను కలిగి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది చల్లని ఉష్ణోగ్రతలతో పాటు ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి కారణం అవుతుందని వివరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications