వణికిపోతున్న హైదరాబాద్ - కరోనా వేళ బీ అలర్ట్ : మరో రెండు రోజులు..!!
హైదరాబాద్ వణికిపోతోంది. రోడ్లు రాత్రి 9 దాటిన తర్వాత నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం కొనసాగుతోంది. నగర శివార్లలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9 గంటల వరకు పొగమంచు కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు 30.2 డిగ్రీలు నమోదుకాగా, కనిష్ఠం 11.4 డిగ్రీలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదు అవుతున్నాయి.

ఆరెంజ్ అలర్ట్ ప్రకటన
చలి ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములు గు, కొత్తగూడెం, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి బాగా పెరిగింది. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి.

విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోనూ
పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరోవైపు చలిగాలుల తీవ్రతతో జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడే కరోనా, ఆస్తమా రోగులు మరింత బాధపడుతున్నారు.

రికార్డు స్థాయిలో కనీష ఉష్ణోగ్రత
ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ) గ్రామంలో రికార్డుస్థాయిలో 4.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. గత పదేళ్లలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. అలాగే, ఆదివారం, సోమవారం కూడా ఇదే స్థాయిలో రాష్ట్రంలో కనిష్ట ఉష్టోగ్రతలు నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల్లో కేంద్రీకృతమైన గాలులతో దాని వెంబడి ఉన్న గాలులు కూడా చల్లగా మారుతున్నాయి. ఉత్తర భారతం నుంచి దక్షిణాదిలోకి ఉపరితల శీతల గాలులు ప్రయాణిస్తూ ఛత్తీస్గఢ్ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి.

కరోనా వేళ అప్రమత్తంగా
దీంతో తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక, ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో జలుబు..దగ్గు ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ చలి గాలుల సమయంలో కరోనా విస్తరిస్తున్న వేళ..అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications