కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
భారత్-చైన సరిహద్దు ఢఖ్ గల్వాన్ లోయలో జూన్ 15, 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి సంతోష్ బాబు అమరుడైన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది వరకు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సంతోష్ బాబు అమరుడై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన త్యాగాన్ని స్మరిస్తూ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
సూర్యపేటలో సంతోష్ బాబు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. సీఎం చెప్పిన విధంగా రూ. 20 లక్షల వ్యయంతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేశారు.
కాగా, సూర్యాపేటకు వెళ్లి సంతోష్ బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల రూపాయల నగదు, కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం, బంజారాహిల్స్ ప్రాంతంలో 711 గజాల ఇంటి స్థలాన్ని అందజేశారు. ప్రస్తుతం సంతోష్ బాబు భార్య డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.