నాపై కాదు, కేటీఆర్-అమిత్ షా కొడుకుపై దాడి చేయాలి: రాత్రంతా రేవంత్ రెడ్డి విచారణ, కీలక సమాచారం
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఇరవై నాలుగు గంటలు దాటినా సోదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ను రాత్రి నుంచి ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఏకధాటిగా పది గంటల పాటు ఆయనను విచారించారని తెలుస్తోంది.
గురువారం రాత్రి ఏడు గంటలకు రేవంత్ జూబ్లీహిల్స్లోని తన నివాసానికి వచ్చారు. అప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఒక్కో బ్యాంకులోని నిధుల గురించి ఆయా బ్యాంకు అధికారుల సమక్షంలోనే ఐటీ అధికారులు పత్రాల రూపంలో ఆరా తీయడంతో పాటు, రేవంత్ను విచారించారు.
ఇదే నా చివరి స్పీచ్ కావొచ్చు, జైలు నుంచి నామినేషన్: రేవంత్ ఉద్వేగం, హైదరాబాద్కు రాక
ప్రధానంగా మూడు అభియోగాలపై విచారణ
రేవంత్ రెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తులు, మనీలాండరింగ్, పన్ను ఎగవేత.. ప్రధానంగా ఈ మూడు అభియోగాల పైనే విచారణ జరపుతున్నారు. విచారణలో రేవంత్ నుంచి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది. రేవంత్ వార్షిక ఆదాయం రూ.5 లక్షలు, అతని భార్య వార్షిక ఆదాయం రూ.7 లక్షలుగా చూపించారు. ఈ కోట్లాది రూపాయలు ఎక్కడివి అని అధికారులు ఆరా తీస్తున్నారు.
సాయిమౌర్య నుంచి షెల్ కంపెనీలకు నిధులు, అవన్నీ రేవంత్కే
శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ 2003లో 80 మంది కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో ప్రారంభించారు. ఒక్కో షేరుకు రూ.2 లక్షలతో రూ.66 లక్షలు పెట్టుబడి పెట్టారు. 2010లో చివరిసారిగా ఐటీకి లెక్కలు సమర్పించింది ఈ కంపెనీ. రూ.200 నుంచి రూ.300 కోట్లు.. 18 షెల్ కంపెనీలకు ఈకంపెనీ నుంచి నిధులు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. షెల్ కంపెనీల నుంచి వచ్చే ఆదాయం మొత్తం రేవంత్ రెడ్డికే వచ్చినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
మెక్సా సీడ్స్ కొనుగోలుకు రుణం
మెక్సా సీడ్ కంపెనీని రేవంత్ రెడ్డి వియ్యంకుడు వెంకట్ రెడ్డి ప్రారంభించారు. మెక్సా సీడ్స్ కంపెనీని రూ.14 కోట్లకు అమ్మారు. దీనిని తిరిగి రూ.80 కోట్లకు కొనుగోలు చేశారు. దీనిని కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి రూ.75 కోట్ల రుణం తీసుకున్నారు.
వార్షికాదాయం, చెల్లింపులపై ఆరా
ఇద్దరు దంపతుల వార్షికాదాయం రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షల మధ్య ఉంది. హౌసింగ్ లోన్కే ఏడాదికి రూ.19.20 లక్షల ఈఎంఐ కడుతున్నారు. వార్షిక ఆదాయం, ఈఎంఐ చెల్లింపుల్లో తేడాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు.
పది గంటల పాటు విచారణ, కీలక సమాచారం
రేవంత్ రెడ్డి సోదరుడు కోండల్ రెడ్డి, ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హా ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. ఐదు రోజుల్లో సమాధానం చెప్పాలని కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 1వ తేదీన మరోసారి విచారణకు రావాలని సెబాస్టియన్కు సూచించారు. తన ఇంటిపై ఐటీ సోదాల అంశంపై రేవంత్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ... ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు. అసలు ఈడీ, ఐటీ అధికారులు అమిత్ షా కొడుకు జే షా, కేసీఆర్ కొడుకు కేటీ రామారావు ఇళ్ల పైన దాడులు చేయాలని వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ లేఖ
రేవంత్ రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ ఓ లేఖ మీడియా సంస్థలకు వచ్చింది. ఈ లేఖలోని వివరాల ప్రకారం.. రేవంత్ 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్న వాటికంటే చాలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. 2009లో మొత్తం ఆస్తుల విలువ రూ.3.6 కోట్లు, రూ.73 లక్షల అప్పులు చూపించారు. 2014లో ఆస్తుల విలువ రూ.13.12 కోట్లకు పెరిగాయి. అప్పులు రూ.3.3 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఐటీ శాఖకు సమర్పించిన రిటర్న్స్లో చూపిన దానికి, ఈ ఆదాయానికి పొంతన లేదు. రేవంత్కు హాంకాంగ్, కౌలంపూర్ల్లోను బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయి. వీటిలో రూ.కోట్లు ఉన్నాయి. ఒకేరోజు రూ.20 కోట్లకు పైగా విలువైన విదేశీ కరెన్సీ రేవంత్ ఖాతాల్లో జమ అయింది. 2014 ఎన్నికలకు ముందే ఈ మొత్తం వచ్చినా ఎన్నికల అఫిడవిట్లో చూపలేదు. ఎందుకంటే ఈ సొమ్ము మనీల్యాండరింగ్, హవాలా తదితర మార్గాల్లో వచ్చింది. రేవంత్ సోదరులు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లతో దేశ విదేశాల్లో భారీగా ఆస్తులు సంపాదించారు. 19 కంపెనీల్లో రేవంత్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉంది. ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న 23 మందితో ఆయనకు దగ్గర బంధుత్వం ఉంది. ఆయనకు ఉప్పల్, గోపనపల్లి, కోకాపేట్తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్లాట్లు, నందగిరిహిల్స్లో వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా భూములు ఉన్నాయి. 2014 నుంచి 2017 వరకు ఐటీ రిటర్న్ ప్రకారం రేవంత్, ఆయన భార్య ఆదాయం ఏడాదికి రూ.ఐదారు లక్షలకు మించి లేదు. కానీ భారీగా ఆస్తులు కొన్నారు. రుణాలు కూడా తీసుకున్నారని లేఖలో ఉంది.