కోవిడ్ మరణాలపై డెత్ రిపోర్ట్ ఆడిట్ కమిటీకి డిమాండ్-వాస్తవాలు బయటపెట్టకపోతే బాధితులకు ద్రోహం...
తెలంగాణలో కోవిడ్ కేసులు,మరణాలను ప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తోందని ప్రతిపక్షాలు మొదటినుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం చెబుతున్న ఈ తప్పుడు లెక్కల ద్వారా బాధిత కుటుంబాలు కేంద్రం ఇచ్చే పరిహారానికి దూరమవుతాయని ప్రతిపక్ష నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ మరణాలపై వాస్తవాలను వెలికితీసేందుకు డెత్ రిపోర్ట్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు లేఖ రాశారు.
Recommended Video

అది పచ్చి అబద్దం : దాసోజు శ్రవణ్
సుప్రీం కోర్టు తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న పరిహారం బాధిత కుటుంబాలకు అందేలా కోవిడ్ మరణాలపై లెక్కలను సరిచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏడాదిన్నర కాలంలో కేవలం 3715 మంది మాత్రమే కోవిడ్తో చనిపోయారని చెప్పడం పచ్చి అబద్దమన్నారు. అది నేరంతో సమానమని ఆరోపించారు. దాదాపు లక్షన్నర మంది చనిపోయారన్న అంచనా ఉంటే... 3వేల పైచిలుకు చావులను మాత్రమే నమోదు చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు.

బాధిత కుటుంబాలకు ద్రోహం : శ్రవణ్
ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారులుగా ఉన్న శ్రీనివాసరావు,రమేశ్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా మారి అబద్దపు లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. తప్పుడు లెక్కలు చూపుతున్న ఆ ఉన్నతాధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం... ఇప్పుడు చావుల్లోనూ తప్పుడు లెక్కలు చూపుతూ బాధిత కుటుంబాలకు ద్రోహం చేస్తోందన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు...
కోవిడ్ మరణాలపై ఇటీవల సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు కేంద్రం కనీసం పరిహారం ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశాలిచ్చింది. దీనిపై 6 వారాల్లోగా విధివిధానాలను రూపొందించాలని ఆదేశించింది. కేంద్రం తమ వద్ద నిధులు లేవని కోర్టుకు చెప్పగా... న్యాయస్థానం ఆ వాదనను తోసిపుచ్చింది. కనీస పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కోవిడ్ మరణాల లెక్కలను సరిచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తద్వారా బాధిత కుటుంబాలకు కొంతలో కొంత న్యాయం జరుగుతుందని చెబుతోంది.

అనాథ పిల్లలకు కేంద్రం కార్పస్ ఫండ్
కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలకు కేంద్రం రూ.10లక్షలు కార్పస్ ఫండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్తో తల్లిదండ్రులు లేదా సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు... వారికి 18 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.10లక్షలు ఫండ్ ఏర్పాటు చేయనుంది. అలాగే వారి విద్యకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. ఆంధ్రప్రదేశ్,కేరళ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా పథకాలను కేంద్రం కన్నా ముందే ప్రకటించాయి.












Click it and Unblock the Notifications