వైఎస్ షర్మిలకు పోటీ: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత పాదయాత్ర: ముహూర్తం ఇదే
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సంవత్సరంలోకి దాదాపుగా అడుగు పెట్టినట్టే. వచ్చే సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ మధ్య కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి, దాన్ని ఢీ కొట్టడానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ వ్యూహాలు పన్నుతున్నాయి. వైఎస్ షర్మిల సారథ్యంలోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సైతం ఎన్నికలకు సై అంటోంది. హేమాహేమీల్లాంటి పార్టీలను ఢీ కొట్టడానికి సమాయాత్తమౌతోంది. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.
కర్ణాటక పాఠశాలల్లో భగవద్గీత: నైతిక శాస్త్రం పేరుతో: హిజబ్ నిషేధం సక్సెస్తో.
జనంలోకి..
ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో- ఆయా పార్టీల సీనియర్ నాయకులు కూడా ఇక గడప దాటనున్నారు. ఎన్నికల వరకు ప్రజల మధ్యన ఉండేలా భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను రూపొందించుకుంటోన్నారు. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రతో జనంలోకి చొచ్చుకెళ్తోన్నారు. గ్రామస్థాయిలో తన కొత్త పార్టీని బలోపేతం చేసుకుంటోన్నారు. ప్రస్తుత ఆమె పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది.
భట్టి విక్రమార్క పాదయాత్ర
ఇదివరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేశారు. ఆ తరువాత బ్రేక్ ఇచ్చారు. రెండో విడత పాదయాత్రను ఆయన చేపట్టాల్సి ఉంది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారాయన.
షెడ్యూల్ ఖరారు..
నియోజకవర్గ నేతలతో మాట్లాడి తన షెడ్యూల్ను ఖరారు చేస్తానని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని, అన్ని వర్గాల ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటానని చెప్పారు. సీఎల్పీ నేతగా నియమించినప్పుడే- నిత్యం ప్రజల్లో ఉండాలంటూ పార్టీ అధిష్ఠానం సూచించిందని, ఇప్పుడు మళ్లీ కొత్తగా అనుమతిని తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను మాత్రమే కాదు.. పార్టీ నాయకులెవరూ గాంధీ భవన్కు పరిమితం కాకూడదని, నిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పారు.
టీఆర్ఎస్లో చేరడమా?
తాను టీఆర్ఎస్లో చేరుతానంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన విమర్శలను భట్టి విక్రమార్క తప్పుపట్టారు. భట్టి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే భట్టి అని, ఈ విషయం రఘునందన్కు కూడా తెలుసునని అన్నారు. బట్ట కాల్చి ముఖం మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తాను లోక్సభకు వెళ్లాల్సి వస్తే అది కాంగ్రెస్ టికెట్పైనే స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్యే లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ఎదురుదాడి చేశారు భట్టి.
Recommended Video
రాహుల్ గాంధీకి పగ్గాలు..
మతతత్వం దేశంలో పెచ్చరిల్లిందని, విచ్ఛిన్నానికి కుట్ర జరుగుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. దేశంలో అన్ని వర్గాలను కాపాడ గలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సారధ్య బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆగస్టు 20వ తేదీన ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలను నిర్వహిస్తారని, పోటీ లేకుండా రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలను అందించాలని అన్నారు.