ఆసక్తికరం: రామోజీరావుతో కాంగ్రెస్ నేత భేటీ! పార్టీ మార్పా? సొంత పార్టీ యోచనా?
ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావును.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. మంగళవారం రామోజీరావు నివాసానికి వెళ్లిన కోమట్టిరెడ్డి ఆయనతో సమావేశ
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావును.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవడం ఆసక్తికరంగా మారింది. మంగళవారం రామోజీరావు నివాసానికి వెళ్లిన కోమట్టిరెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
రామోజీరావుతో కోమటిరెడ్డి భేటీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీలో కాస్త అసహనంతో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డే కావడంతో వీరి భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీని వెనుక ఉన్న కారణాలేమిటనే విషయం చర్చనీయాంశమైంది.
పీసీసీ అధ్యక్ష పీఠంపై కన్ను...
నిజానికి పీసీసీ అధ్యక్ష పీఠంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎప్పట్నించో కన్నుంది. ఆ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు కూడా. తాను పీసీసీ అధ్యక్ష పదవి ఆశించడంలో తప్పులేదంటూ అప్పట్లో చెప్పుకొచ్చారాయన. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఆయనకు ఆ అవకాశం ఇవ్వడం లేదు.
బీజేపీలో చేరబోతున్నారా?
కాంగ్రెస్ లో తనకు ప్రాముఖ్యత దక్కని నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరతారని మొదట్లో ప్రచారం జరిగినా అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు ఆయన కాషాయం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాముఖ్యత సంపాదించుకుంది.
సొంత పార్టీ పెడుతున్నారా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రామోజీరావుతో భేటీ అవడం వెనుక కచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉందని అంటున్నారు. కోమటిరెడ్డి సోదరులు బీజేపీలో చేరడంగానీ లేదంటే సొంత పార్టీ స్థాపించే ప్రయత్నాల్లో ఉన్నారని.. అందుకే వెంకట్ రెడ్డి మీడియా టైకూన్ రామోజీరావుతో సమావేశం అయ్యారనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
పెదవి విప్పని కోమటిరెడ్డి...
అయితే రామోజీరావుతో తన భేటీపై కోమటిరెడ్డి పెదవి విప్పి మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటి తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిదాయకంగా మారింది. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏదో సంకేతం పంపించాలనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి ఇలా చేశారని, ఆయన ప్లానేంటో కచ్చితంగా తెలియడం లేదని అంటున్నారు.