టీఆర్ఎస్లోకి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు... హుజురాబాద్ ఉపఎన్నికవేళ మారుతున్న రాజకీయం...
టీపీసీసీ చీఫ్ పదవి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికే ఖాయమని ప్రచారం జరుగుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్ నేత ముద్దసాని కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో సోమవారం(జూన్ 22) మంత్రులు హరీశ్ రావు,కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా కశ్యప్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో హుజురాబాద్లో జరిగే సభలో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరడం ఖాయమన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా విజయం కోసం అంకితభావంతో పనిచేస్తానన్నారు.
హుజురాబాద్లో గెలుపు టీఆర్ఎస్దే -హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ... హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు. 2001 నుంచి హుజురాబాద్ టీఆర్ఎస్కు కంచుకోట అని... హుజురాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తి అని... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ను ఇక్కడి ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారని చెప్పారు. హుజురాబాద్ ప్రజలు ఆత్మాభిమానం,ఆత్మగౌరవం కలవారని... రానున్న ఉపఎన్నికలోనూ టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అన్నారు.
టికెట్ రేసులో ముద్దసాని పురుషోత్తమ్ రెడ్డి..?
ముద్దసాని కశ్యప్ రెడ్డి హుజురాబాద్కు చెందిన మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి తనయుడు. గతంలో టీడీపీ తరుపున హుజురాబాద్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలందరినీ గులాబీ పార్టీ ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగానే ముద్దసాని కశ్యప్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ముద్దసాని కుటుంబానికి హుజురాబాద్లో మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ముద్దసాని కుటుంబానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ ఉపఎన్నిక టికెట్ ఇవ్వొచ్చునన్న ప్రచారం కూడా జరుగుతోంది. ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు,రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ముద్దసాని పురుషోత్తమ్ రెడ్డికి టికెట్ దక్కవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
హీటెక్కుతున్న రాజకీయం
ఇప్పటికైతే టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో పార్టీ నుంచి ఎటువంటి సమాచారం లేదు. పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ ఇప్పట్లో పేరు వెల్లడించే అవకాశం కనిపించట్లేదు. ఆలస్యమైనా సరే.. బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని టీఆర్ఎస్ భావిస్తోంది. హుజురాబాద్లో ఈటలను ఓడించడం ద్వారా కేసీఆర్ను వీడి బయటకెళ్లినవారికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని టీఆర్ఎస్ నిరూపించాలనుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేలను హుజురాబాద్లో మోహరించింది. సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తూ... నియోజకవర్గంలో ప్రతీ గడపకూ చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ నేతలతో కలిసి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉపఎన్నిక కోసం వ్యూహ రచన మొదలుపెట్టారు. ఉపఎన్నికలో గెలుపు తనదేనని ఆయన ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ కేంద్రంగా మున్ముందు రాజకీయం మరింత హీటెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.