Rahul Gandhi: నిరుద్యోగులతో రాహుల్ గాంధీ భేటీ..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ అశోక్ నగర్ లోని నిరుద్యోగులతో సమావేశమయ్యారు. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం బోధన్ లో రాహుల్ గాంధీ పర్యటించారు. బోధన్లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. తెలంగాణలో ప్రజాపాలన కనిపించడం లేదన్నారు. కేవలం కుటుంబ, అవినీతి పాలన మాత్రమే కనిపిస్తుందని చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ రూ.1200కి పెరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిలిండర్ ధర తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేసీఆర్ కారు పంక్చర్ అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టడం ఖాయమన్నారు రాహుల్. బోధన్ కాంగ్రెస్ విజయభేరి సభలో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అక్కడ నుంచి ఆదిలాబాద్ చేరుకున్న రాహుల్ అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో ధరణితో దొరలు పేదల భూములు గుంజుకున్నారని అన్నారు. తెలంగాణ మంతత్రులందరూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. 8,000 మంది రైతులు దొరల తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని కేసీఆర్, మంత్రులు నాశనం చేశారని రాహుల్ అన్నారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీ సిరిసిల్ల జిల్ల వేములవాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ప్రతీ ఒక్కరు చేయి గుర్తు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వేములవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాహుల్ నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత చిక్కడ్ పల్లి బావర్చి హోటల్ రాహుల్ గాంధీ సందడి చేశారు.












Click it and Unblock the Notifications