ఆగని వలసలు, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత: పార్టీలో సముచిత గౌరవంపై కేటీఆర్ హామీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెరాసలోకి వలసలు ఆగడం లేదు. ఆదివారం మరో కీలక నేత కారు ఎక్కారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతామని చెప్పారు. వారితో పాటు కీలక నేతలు కూడా అధికార పార్టీలో చేరుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరెపల్లి మోహన్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆయనతో పాటు పలువురు సర్పంచులు, జడ్పీటీసీలను తెరాసలోకి వచ్చారు. ఆరెపల్లి మోహన్ రాకతో మానకొండూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ అన్నారు. తెరాస ప్రభుత్వ అభివృద్ధికి ఆకర్షితులై వచ్చే ఆరెపల్లి మోహన్లాంటి వారికి పార్టీ సముచిత గౌరవం ఇస్తుందన్నారు.
మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?
బంగారు తెలంగాణ సాధన కోసం పాటుపడుతున్న కేసీఆర్కు మద్దతుగా నిలిచేందుకే తాను తెరాసలో చేరానని ఆరెపల్లి మోహన్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చూసి పార్టీలో చేరుతున్నానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని రోజురోజుకీ కోల్పోతుందని వ్యాఖ్యానించారు.
నల్గొండలోను చేరికలు
ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెరాసలో చేరారు. ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడారు. దండుమల్కాపూర్ గ్రామశివారులో ఏర్పాటు కాబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణంతో స్థానికులకు భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలన్నారు.