రేవంత్ రెడ్డి స్థానంలో కొత్త పేరు: అనూహ్యంగా.. పీసీసీ సారథిగా
Damodar Raja Narsimha: తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతూ వస్తోన్న హైడ్రామాకు తెర పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ నెల 7వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమైంది. వారిద్దరితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, జీవన్ రెడ్ మంత్రులుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా ఎంపికైన నేపథ్యంలో- తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన నాలుగైదు రోజుల్లో కొత్త పీసీసీ కమిటీ ఎంపికవుతుందని తెలుస్తోంది. కమిటీ మొత్తాన్నీ పునర్వ్యవస్థీకరిస్తారని సమాచారం.
కొత్త పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు దామోదర్ రాజ నర్సింహను నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సామాజిక వర్గ సమీకరణలు, ప్రాంతం ప్రాతిపదికన ఆయన పేరును పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని చెబుతున్నారు. దామోదర్ రాజనర్సింహ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని అంటున్నారు.

మొన్నటి ఎన్నికల్లో ఆయన అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థిగా బరిలోకి దిగిన క్రాంతి కిరణ్ను 28 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
మాల సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన నేపథ్యంలో మారిన సమీకరణాలను ఆధారంగా చేసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహను పీసీసీ అధ్యక్షుడిగా చేయడం వల్ల దీన్ని సమం చేసినట్టవుతుందనేది పార్టీ ఉద్దేశమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications